జూన్ 2పై బెజవాడలో బాబు: 'మనకు విభజన దినం.. మన పొట్టగొట్టిన దినం’
అమరావతి: విజయవాడ బెంజిసర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్షలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధి కోసం ప్రజలతో ఆయన నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కొత్త రాష్ట్రం ఏర్పడితే ఏ ప్రాంత ప్రజలైనా సంబరాలు జరుపుకుంటారని, కానీ ఏపీలో విభజనతో జరిగిన అన్యాయం కారణంగా మనం ఈరోజు దీక్ష చేసుకుంటున్నామన్నారు.
సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు రోడ్లపైకి వచ్చి ఉద్యమించినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా విభజనను ఆపలేకపోయామని చెప్పారు. 'కలలో కూడా ఆలోచించలేదు, మనకు ఇంత అన్యాయం జరుగుతుందని. ఇటలీకి జూన్ 2 స్వాతంత్ర్య దినం.. మనకు విభజన దినం.. మన పొట్టగొట్టిన దినం' అని ఆయన అన్నారు.
ఇటలీ స్వాతంత్య్ర దినోత్సవం రోజున మనల్ని బజారులోకి నెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చేయాలంటే ఏపీకి న్యాయం చేయాలని కోరానని అప్పటి ప్రభుత్వాన్ని కోరినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఒకవేళ విభజన వద్దంటే తెలంగాణను ఒప్పించండి అని అడిగినట్లు చెప్పుకొచ్చారు.
To encourage teachers to become role models for students, made the new recruits take an oath of commitment. pic.twitter.com/62iSkgqzHD
— N Chandrababu Naidu (@ncbn) June 2, 2016
ఆనాటి ప్రభుత్వం మన సమస్యలను లెక్కచేయలేదని చెప్పారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా విభజన ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 'తిరిగి కోలుకోలేనంత అన్యాయం జరిగింది, విభజనలో హేతుబద్ధత లేదు.. కుట్ర జరుగుతోందని పసిగట్టి ప్రజలంతా పోరాడారు' అని ఆయన అన్నారు.
ఎవరూ ఊహించని విధంగా అన్యాయంగా విభజన చేశారని ఆయన అన్నారు. పార్లమెంటు తలుపులు మూసి, సీసీ కెమెరాలు ఆఫ్ చేయించి, చీకటిలో అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభా ప్రకారం అప్పులు పంచారు, ఆదాయం మాత్రం ఎక్కడిది అక్కడే అన్నారని వివరించారు.
విభజన తర్వాత ఆస్తులు రాలేదు .. అప్పులు మాత్రమే మిగిలాయని రాష్ట్ర పరిస్థితిని వివరించారు. సమస్యల సుడిగుండంలో ఉన్నాం.. అయినా భయపడేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ కోడెల, సీఎస్ టక్కర్, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
At Benz Circle, took the pledge with people of AP to rebuild the state & ensure its progress. #NavanirmanaDeeksha pic.twitter.com/NXJZBcYGab
— N Chandrababu Naidu (@ncbn) June 2, 2016
అంతక ముందు ఒకైవపు ఏపీఎన్జీవోస్ అధ్యక్షుడు అశోక్ బాబు, మరోవైపు సచివాలయ ఉద్యోగుల సంఘం నేత మురళీకృష్ణ ఆ వెనుకే ఉద్యోగులు, టీడీపీ నేతలు, విజయవాడ నగర ప్రజలు వెంట రాగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నవ నిర్మణ దీక్షా స్థలికి బయల్దేరారు.
విజయవాడలోని డీవీ మేనర్ హోటల్ నుంచి ప్రారంభమైన చంద్రబాబు యాత్రకు నగర ప్రజలు భారీగానే స్పందించారు. స్వచ్ఛందంగా వందలాది మంది చంద్రబాబు వెంట నడిచేందుకు రోడ్డెక్కారు. ఈ పాదయాత్ర సందర్భంగా అశోక్ బాబుతో పాటు ఇటు మురళీకృష్ణతో రాష్ట్ర స్థితిగతులపై చర్చిస్తూ చంద్రబాబు ముందుకు సాగారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నవ నిర్మాణ దీక్షలు చేపట్టారు. కర్నూలు జిల్లా కలెక్టరేట్ నుంచి రాజ్ విహార్ సెంటర్ వరకు నవనిర్మాణ దీక్ష ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్రెడ్డి, మణిగాంధీ, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ శిల్పాలు పాల్గొన్నారు.
కాగా, ప్రకాశం జిల్లాలో జరిగిన నవ నిర్మాణ దీక్ష ర్యాలీలో ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావుతో పాటు కలెక్టర్ సుజాత శర్మలు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో కూడా ఈ నవ నిర్మాణ దీక్ష ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో కలెక్టరేట్ నుంచి గాంధీ విగ్రహం వరకు ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో పునర్నిర్మాణ స్ఫూర్తిని పెంచేందుకు జూన్ 2 నుంచి 7 వరకు నవనిర్మాణ వారం పాటిద్దాం. రేపు ఉదయం 11AM కు ప్రతిజ్ఞ చేద్దాం.
— N Chandrababu Naidu (@ncbn) 1 June 2016