చాంబర్లోకి బాబు: నన్నపనేనిపై సరదాగా యనమల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపి సచివాలయంలోకి విజయదశమి రోజున అధికారికంగా అడుగు పెట్టేందుకు ఆలోచనలో ఉన్నారు. సచివాలయంలోని ఎల్ బ్లాక్ ఎనిమిదో అంతస్తులో చంద్రబాబు కోసం ఛాంబర్ సిద్ధం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి ఛాంబర్లోని బుల్లెట్ ప్రూఫ్ కిటీకిలోంచి చూస్తే బిర్లా మందిర్ కనిపించేలా ఛాంబర్ను తీర్చిదిద్దారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి పక్కనే మంత్రివర్గ సమావేశ మందిరం, వీడియో కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి.
నన్నపనేనిపై యనమల..

టిడిపి నాయకురాలు నన్నపనేని రాజకుమారి ట్రబుల్ క్రియేటర్ అని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సరదాగా అభిప్రాయపడ్డారు. శాసనమండలిలో ద్రవ్యవినిమయ బిల్లు ఆమోదం పొందిన సమయంలో పదవుల భర్తీ అంశం చర్చకు వచ్చింది. ఈ సమయంలో యనమల మాట్లాడుతూ... ప్రభుత్వ చీఫ్ విప్గా నన్నపనేని రాజకుమారిని, విప్లుగా అంగర రాంమోహన్, కెవివి సత్యనారాయణ రాజులను నియమించినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా యనమల సరదాగా మాట్లాడుతూ.. నన్నపనేని ట్రబుల్ క్రియేటర్ అన్నారు. దాంతో స్పందించిన నన్నపనేని తనకు కోపం, ఆవేశం కాస్త ఎక్కువేనని అంగీకరించారు. నన్నపనేని రాజకుమారి, సత్యనారాయణరాజు, రాంమోహన్ల నియామకానికి సంబంధించి శనివారమే జీఓ విడుదలైంది. ఈ ముగ్గురికి ఏపి ప్రభుత్వం క్యాబినెట్ హోదా కల్పించింది.












Click it and Unblock the Notifications