ఏపీలో ఫ్రీ బస్సు ప్రారంభం- చంద్రబాబు, పవన్, లోకేష్ ఏమన్నారంటే ?
ఏ రంగం తీసుకున్నా మహిళలు నంబర్ వన్ అని, ఆవకాయ పట్టాలన్నా మీరే, అంతరిక్షానికి వెళ్లాలన్నా మీరేనని మంత్రి నారా లోకేష్ తెలిపారు. టీడీపీ ముందు నుంచీ అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యమిస్తూ వచ్చిందని, గతంలో ఎన్టీఆర్ మహిళలకు ఆస్తుల్లో సమాన హక్కు కల్పించారని, స్థానిక సంస్థల్లో 9 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని లోకేష్ తెలిపారు. మహిళలకు ప్రత్యేకంగా యూనివర్శిటీ ఏర్పాటు చేసింది కూడా ఎన్టీఆరే అన్నారు. డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేయడమే కాకుండా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంతో పాటు ప్రతిభా భారతిని అసెంబ్లీకి తొలి మహిళా స్పీకర్ ను చేసింది చంద్రబాబే అన్నారు.
మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని, అందుకే తమ ఇల్లే ఓ నిదర్శమని లోకేష్ తెలిపారు. హెరిటేజ్ సంస్థ ప్రారంభించాక ఆర్థికమంత్రి అయిన చంద్రబాబు .. భువనేశ్వరికి బాధ్యతలు ఇస్తే ఇప్పుడు 5 వేల కోట్ల కంపెనీని నడిపిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ను కూడా తన తల్లి నడిపిస్తోందన్నారు. స్టాన్ ఫర్డ్ లో చదువుకుని వచ్చి హెరిటేజ్ ను నడిపిస్తున్న తన భార్య బ్రాహ్మణి తన క్రెడిడ్ కార్డు బిల్లు కట్టే పరిస్ధితి ఉందన్నారు. అసెంబ్లీలో తన తల్లిని అవమానిస్తే కోలుకోవడానికి మూడునెలలు పట్టిందన్నారు. మహిళలపై విమర్శలు చేసే వారిని అన్న లోకేష్ తోలు తీస్తాడని చెప్పాలన్నారు. స్త్రీ శక్తి పథకంతో బాలికలకు నెలకు 1500 నుంచి 2 వేలు ఆదా అవుతుందన్నారు.

అనంతరం మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ... గత ఎన్నికలకు ముందు ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇస్తే ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయి కదా అని అడిగానని, కానీ ఆయన అనుభవంతో దాన్ని నెరవేర్చారన్నారు. ఉచిత బస్సు పథకం అమలు చేసినందుకు అడపడుచుల తరఫున చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. ఇది ఉచిత ప్రయాణం మాత్రమే కాదని, ప్రతీ మహిళకూ ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం అందించే పథకమని పవన్ కళ్యాణ్ కితాబిచ్చారు. ఇది చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనం అన్నారు.
మహిళలకు ఆర్ధిక స్వాతంత్రం కల్పించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆడబిడ్డలకు మహర్దశ వచ్చే వరకూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మహిళలకు ఆర్ధిక స్వాతంత్రం తీసుకురావడం, ఆడబిడ్డల గౌరవం పెంచేందుకే ఈ పథకం ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. సూపర్ సిక్స్ హామీ ఇచ్చే ఆ రోజు నమ్మలేదని, ఇప్పుడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని గర్వంగా చెప్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కళ్యాణ్ ఎన్డీయేగా పొత్తు ఏర్పాటు చేశారని చంద్రబాబు గుర్తుచేశారు.
ఒకప్పుడు తాను ఆర్టీసీ బస్సుల్లో సీట్లతో పాటు డ్రైవర్లు, కండక్టర్లుగా కూడా మహిళలకు రిజర్వేషన్లు పెట్టానని, అయితే కండక్టర్లు వచ్చారు కానీ డ్రైవర్లు రాలేదన్నారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని, ఆ తర్వాత మహిళలు డ్రైవర్లుగా కూడా వస్తారన్నారు. ఉచిత బస్సుతో మహిళలు మార్కెట్లకు, అత్తిళ్లకు వెళ్లి రావడంతో పాటు దేవస్థానాలకు కూడా ఉచితంగా వెళ్లొచ్చే అవకాశం కలుగుతుందన్నారు. చిరు వ్యాపారులు ఇతర ప్రాంతాలకు ఉచితంగా వెళ్లి రావొచ్చన్నారు. అధికారులు ఇబ్బందులు లేకుండా ఈ పథకం అమలు చేయాలన్నారు.

స్త్రీశక్తితో పాటు ఆర్టీసీలోనే మహిళలు డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఆర్టీసీ పార్శిల్ సర్వీస్ తో పాటు ఇతర మార్గాల ద్వారా వారికి అదనపు ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఇకపై ఎలక్ట్రిక్, ఏసీ బస్సులే కొంటామన్నారు. ఈ పథకం అమల్లో ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని, ఓపిగ్గా ఉండాలని సిబ్బందిని కోరారు. అలాగే ఆర్టీసీ సిబ్బందిని గౌరవిస్తూ సజావుగా ప్రయాణాలు చేయాలని మహిళలకు సూచించారు.












Click it and Unblock the Notifications