చంద్రబాబు ప్లాన్: ఏపికి ఢిల్లీ తరహా రాజధాని నిర్మాణం!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కొత్త రాజధాని నిర్మాణంపై తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. తమ పార్టీ నాయకులు, అధికారులతో ప్రతీ రోజు చర్చలు జరుపుతున్నారు. కాగా, కొత్త రాజధాని గుంటూరు-విజయవాడ నగరాల మధ్య నిర్మిస్తే బాగుంటుందని టిడిపి వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం.
చంద్రబాబు నాయుడు గుజరాత్ రాజధాని గాంధీనగర్, న్యూఢిల్లీ తరహాలో ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఉండాలని భావిస్తున్నట్లు తెలిసింది. గుజరాత్ ప్రధాన నగరం అహ్మదాబాద్కు గాంధీనగర్ 25-30 కిలో మీటర్ల దూరంలోనే ఉంటుంది. అందువల్ల మౌలిక, సామాజిక అభివృద్ధికి అవకాశం ఏర్పడింది. దీంతో గుంటూరు-విజయవాడ నగరాల మధ్య కొత్త రాజధాని ఏర్పాటు చేస్తే అన్ని రకాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ ద్వారా భారీ ఎత్తున నిధులు రాబట్టుకుని.. దివంగత ప్రముఖ అర్కిటెక్ట్ లూటిన్స్ నిర్మించిన ఢిల్లీ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని నిర్మించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలిసింది. పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి తొందరగా వెళ్లిపోవాలని భావిస్తున్న చంద్రబాబు నాయుడు.. వీలైనంత త్వరగా సీమాంధ్ర రాజధానిని నిర్మించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది.
అయితే అదే సమయంలో హైదరాబాద్ అభివృద్ధికి కూడా తాము సహకరిస్తామని చంద్రబాబు పేర్కొంటున్నారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో తెలుగుదేశం పార్టీ చెప్పుకోదగిన ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించిన నగర ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చంద్రబాబు చెబుతున్నారు. ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యం సీమాంధ్రకు కొత్త రాజధానిని నిర్మించడమేనని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని హంగులతో కొత్త రాజధానిని నిర్మించాలని.. ఇది కూడా చాలా తక్కువ సమయంలోనే జరగాలని చంద్రబాబు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications