నన్ను కాల్చి చంపండి: చెవిరెడ్డి, బాబుకు 'చిత్తూరు' భయం: రోజా
చిత్తూరు: ప్రజల తరఫున పోరాటం చేస్తే అరెస్టు చేస్తారా? కేసుల్లో అక్రమంగా ఇరికించి నన్ను జైలుకు పంపిస్తారా? ఇంతకంటే ఏం చేస్తారు, చంపుతారా? రోడ్డు పైనే నన్ను కాల్చి చంపేయండి.. అని వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి శనివారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిత్తూరు జైలుకు చెవిరెడ్డి: స్టేషన్ బెయిల్ ఇవ్వదగ్గ కేసుపై బాబు కక్ష
చిత్తూలు జిల్లా జైలులో ఉన్న చెవిరెడ్డి శనివారం ఉదయం ఏడున్నర గంటలకు బెయిల్ పైన విడుదలయ్యారు. ఆ తర్వాత వెంటనే మరో కేసులో అతనిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రెండు రోజుల క్రితం నిర్వహించిన ధర్నా కేసులో ఎంఆర్ పల్లి పోలీసులు వెంటనే అరెస్టు చేశారు.

ఆ తర్వాత తిరుపతి కోర్టులో హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పు మేరకు ఆయనను కడప జిల్లాకారాగారానికి రిమాండుకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తనను ఇరవై మందితో కూడిన సాధారణ బ్యారక్లో ఉంచడం కక్ష సాధింపే అన్నారు.
ఇది రాజకీయ కుట్ర: రోజా
చెవిరెడ్డి భాస్కర రెడ్డిని అంతకుముందు కోర్టు వద్ద ఎంపీ మిథున్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజాలు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజా సమస్యల పైన పోరాడే చెవిరెడ్డిని అణిచివేయాలనే కుట్రతో తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, టిడిపికి బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు. పోలీసులు కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే అని చూడకుండా అర్ధరాత్రి లాక్కొచ్చి స్టేషన్లో వేయడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. గడపగడపకూ వైసిపి కార్యక్రమం నేపథ్యంలో సొంత జిల్లాలో టిడిపి ఉనికి కోల్పోతుందని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు.












Click it and Unblock the Notifications