కుప్పంకు బాబు హామీ: సందేహమెందుకని అంబటి ప్రశ్న
తెలుగు ప్రజలకు అన్యాయం చేసిన కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిల భరతం పడతామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమారుడని ఎద్దేవా చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సమైక్య ముసుగు తొడిగారన్నారు. అవినీతిపరులను ఉపేక్షిస్తే రాష్ట్రం పరిస్థితి అధోగతేనని హెచ్చరించారు.
అవినీతి, ప్రజా సమస్యలపై టిడిపి రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉంటే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రభుత్వం రచ్చబండకు ప్రజలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. రాబోయే రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో కీలకపాత్ర పోషిస్తారని చెప్పారు.
బాబుపై అంబటి ఫైర్
సమైక్యం అనేందుకు చంద్రబాబు ఎందుకు సందేహిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత అంబటి రాంబాబు వేరుగా ప్రశ్నించారు. జగన్ సభకు వెళ్లొద్దని చెప్పడం దిగజారుడుతనమే అన్నారు. జగన్ సభకు వస్తే టిడిపికి ప్రజలు ఓటేయరని ఆయన భయమన్నారు. చంద్రబాబు ఎప్పుడైనా సోనియాను విమర్శించారా చెప్పాలన్నారు. తమ పార్టీ కాంగ్రెసుతో కుమ్మక్కైందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజను కిరణ్ పచ్చి దగా చేస్తున్నారని, విభజన ప్రక్రియ వేగంగా సాగుతుంటే ఆయన సమైక్యవాది ఎలా అవుతారన్నారు.
చేతకాకుంటే కూర్చోండి: అశోక్ బాబు
సీమాంధ్ర నేతలకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం చేతకాకుంటే ఢిల్లీలోనే కూర్చోవాలని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు హెచ్చరించారు. విభజనను ఒప్పుకునే రాజకీయ నేతలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామన్నారు. ఈ నెల 24న జరిగే ఐకాస సభలో సమ్మెపై నిర్ణయం తీసుకుంటామన్నారు. జివోఎంలోని పదకొండు అంశాలపై దేనిపైనా స్పష్టత లేదన్నారు. అసెంబ్లీకి టి బిల్లు వస్తే ఏం చేయాలో తమకు తెలుసునన్నారు.