ఏపీలో దాడులు, ఘర్షణలపై చంద్రబాబు రియాక్షన్.. వారికి కీలక సూచన!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న దాడులపైన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ఓటమిపాలై, టిడిపి కూటమి ఘనవిజయం సాధించడంతో అనేక చోట్ల వైసిపి నేతల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తదితరుల ఇళ్ల వద్ద దాడులు జరగడంతో పాటు, అనేక చోట్ల కార్యకర్తల పైన దాడులు కొనసాగుతున్నాయి.
ఘర్షణలపై పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు
టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. వైసిపి కవ్వింపు చర్యలపై తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్యాడర్ సంయమనంతో ప్రవర్తించాలని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడులపై ఆరా తీసిన చంద్రబాబు పార్టీ నేతల ద్వారా సమాచారం తెప్పించుకొని, ఎక్కడ దాడులు జరిగాయి ఎందుకు జరిగాయి అన్న దానిపైన వివరాలు సేకరించారు.

వైసీపీ కవ్వింపు చర్యలు చేసినా సంయమనంతో ఉండాలన్న చంద్రబాబు
వైసిపి కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి దాడులు ప్రతి దాడులు జరగకుండా చూడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ విషయంలో పార్టీ క్యాడర్ పూర్తి సంయమనంతో వ్యవహరించాలని చంద్రబాబు పేర్కొన్నారు. పోలీస్ అధికారులు శాంతిభద్రతలను పరిరక్షించేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు సూచించారు. తెలుగుదేశం పార్టీ నేతలకు, ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేశారు.
ఏపీలో దాడులపై వైఎస్ జగన్ ఇలా
వైసిపి అధినేత ఏపీలో దాడులు కొనసాగుతున్నాయని, ఏపీలో భయానక వాతావరణం టిడిపి సృష్టిస్తుందని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ఎక్స్ వేదికగా జగన్ పెట్టిన పోస్టులో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం జరుగుతున్న వైసీపీ కవ్వింపు చర్యలు, దాడులపై టీడీపీ క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి. వైసీపీ కవ్వింపు చర్యల పట్ల నాయకులు సైతం అలెర్ట్ గా ఉండి.... ఎటువంటి దాడులు, ప్రతి దాడులు జరగకుండా చూడాలి. వైసీపీ మూకలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా పార్టీ కార్యకర్తలు…
— N Chandrababu Naidu (@ncbn) June 7, 2024
అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిందన్న జగన్
వైయస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. గౌరవ గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం అని పేర్కొన్నారు . టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం అంటూ జగన్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications