నా పెళ్లి రోజు, ఈ మంచి పనిచేశా: చంద్రబాబు, 'ఆకాశంలో కట్టలేం'
విజయనగరం: ఈ రోజు తన పెళ్లి రోజు అని, ఇవాళ ఈ మంచి పనిచేశానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయనగరం జిల్లాలో తోటపల్లి రిజర్యాయర్ను ఆయన గురువారం జాతికి అంకితం చేశారు. కుడి కాలువ నుంచి నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కుడి కాలువ ద్వారా 50 వేల ఎకరాలకు నీరు అందుతుంది. పైలాన్, ఎన్టీఆర్ విగ్రహాలను కూడా ఆయన ఆవిష్కరించారు.
డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిర్మించి లక్షా 32 ఎకరాలకు నీరు ఇస్తామని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టుకు 2003లో తానే శంకుస్థాపన చేశానని, 12 ఏళ్ల తర్వాత తానే ప్రారంభించానని, దీన్ని బట్టి గత ప్రభుత్వం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చునని, గత ప్రభుత్వం 30 ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేకపోయిందని ఆయన అన్నారు. తోటపల్లి ప్రాజెక్టును కాంగ్రెసు చిన్నచూపు చూసిందని ఆయన చెప్పారు.
ప్రాజెక్టులు గానీ రాజధాని గనీ ఆకాశంలో కట్టలేమని, దానికి భూమి కావాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని, వారిని ప్రభుత్వం మరిచిపోదని, అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ప్రాజెక్టులకు భూములు ఇచ్చే రైతులను కూడా తమ ప్రభుత్వం అదే రీతిలో ఆదుకుంటుందని ఆయన చెప్పారు. విజయనగరం జిల్లాను అన్ని జిల్లాలతో సమానంగా అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.
తోటపల్లి రిజర్వాయర్కు గౌతు లచ్చన్న పేరు పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. రాజకీయాల్లో విలువల కోసం గౌతు లచ్చన్న నిలబడ్డారని ఆయన చెప్పారు. గోదావరి, కృష్టా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టానని, నీళ్లు ఉంటే రైతులు బంగారం పండిస్తారని ఆయన చెప్పారు. విభజన తర్వాత రాష్ట్రం ఇబ్బందుల్లో పడిందని, లోటు బడ్జెట్ ఉందని, అయితే నమ్మకంతో తనను గెలిపించిన ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని ఆయన చెప్పారు. తన భగీరథ ప్రయత్నంలో తోటపల్లి మొదటిదని ఆయన చప్పారు.
అభివృద్ధిని అడ్డుకోవాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని, ప్రతిపక్షాలు చెప్పే మాటలు నమ్మవద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులను మరిచిపోనని ఆయన చెప్పారు.