కర్నూలు టీడీపీ నేతల జంట హత్యల్లో వైసీపీ హస్తం..చర్యలు తీసుకోవాలని డీజీపీకి చంద్రబాబు లేఖ
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఏపీ డీజీపీకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హత్యలు, దాడులు నిత్యకృత్యంగా మారాయి అని ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్న చంద్రబాబు, పోలీసులు కూడా అధికార పార్టీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు అంటూ విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు కర్నూలు జిల్లా పెసరవాయిలో జంట హత్యలపై ఏపీ డీజీపీకి లేఖ రాశారు.
కర్నూలు జిల్లా పెసర వాయిలో టిడిపి నేతలు నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి దారుణ హత్యకు గురైన ఘటనను ప్రస్తావిస్తూ లేఖ రాసిన చంద్రబాబు ఈ జంట హత్యల కేసులో సాక్షులకు వారి ఆస్తులకు రక్షణ కల్పించాలని చంద్రబాబు డిజిపి కి విజ్ఞప్తి చేశారు. టిడిపి నాయకులు జంట హత్యలలో వైసిపికి చెందిన వారికి సంబంధం ఉందని చంద్రబాబు లేఖలో స్పష్టం చేశారు. నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి హత్యలు దారుణమని పేర్కొన్న చంద్రబాబు డీజీపీ గౌతమ్ సవాంగ్ దారుణ ఘటనపై దృష్టిసారించాలని విజ్ఞప్తి చేశారు.
కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయిలో తెలుగుదేశం పార్టీ నేతలు దారుణ హత్యకు గురయ్యారు. తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసిన అన్నదమ్ములైన మాజీ సర్పంచ్ నాగేశ్వర్ రెడ్డి, సహకార సంఘం మాజీ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డిని కొందరు ప్రత్యర్థులు అత్యంత కిరాతకంగా వేట కొడవళ్ళతో నరికి హతమార్చారు.
ఈ హత్యలకు పాత కక్షలే కారణమని పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేశారు. ఈ దారుణ ఘటనలో మరో ముగ్గురికి గాయాలు కాగా గాయపడిన వారిని నంద్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బొలెరో వాహనాలతో ఢీకొట్టి, ఆ తర్వాత వేట కొడవళ్ళతో టీడీపీ నాయకులను హతమార్చిన ఘటనలో వైసీపీ నేతల హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపించారు.