మీరే స్ఫూర్తి, సిల్క్ రూట్ను విశాఖ మీదుగా: చైనా మంత్రిని కోరిన చంద్రబాబు
హైదరాబాద్: పెట్టుబడులకు షాంఘై తర్వాత నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిని సెకండ్ హోమ్గా గుర్తించాలని కోరారు. సోమవారం సీఎం చంద్రబాబు చైనా విదేశాంగ శాఖ ఉపమంత్రి చెంగ్ ఫెంజియాంగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందంతో భేటీ అయ్యారు. అనంతరం మాట్లాడుతూ అభివృద్ధిలో తమకు చైనానే స్ఫూర్తి అన్నారు.
కొత్త రాష్ట్రంలో పెట్టుబడులకు విశేష అవకాశాలున్నాయన్నారు. చైనా సిల్క్ రూటును ఏపీలోని విశాఖపట్నం మీదగుండా తీసుకెళ్లాలని చంద్రబాబు చైనా మంత్రిని కోరారు. కోల్కతా, చెన్నైతో పోల్చితే ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరానికి మధ్య భాగంలో ఉందని చంద్రబాబు వారికి వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి చెంగ్ మాట్లాడుతూ చంద్రబాబు చైనా పర్యటన అనంతరం చైనాతో ఏపీ సంబంధాలు మెరుగుపడ్డాయన్నారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో మరిన్ని చైనా సంస్థలకు అవకాశాలు కల్పిస్తామన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాజధాని నిర్మాణం సాకారమవుతుందన్నారు.
అంతకుముందు విజయవాడ చేరుకున్న వారు గేట్ వే హోటల్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడితో భేటీ అయి ఇవే అంశాలపై మాట్లాడారు. కాగా సీఎంతో సమావేశం చైనా విదేశాంగ శాఖ ఉపమంత్రి చెంగ్ ఫెంజియాంగ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం అమరావతిలో పర్యటించనున్నారు.
చైనా, భారత్ మధ్య అనేక సారూప్యతలు: ఎమ్మెల్సీ పయ్యావుల
ఏపీ ప్రభుత్వం, టీడీపీ పార్టీ ఎలా కలిసి పనిచేయాలనే అంశంపై సీఎం చంద్రబాబుతో సోమవారం చర్చించామని ఎమ్మెల్సీ పయ్యావులకేశవ్ తెలిపారు. సోమవారం చైనా ప్రతినిధుల బృందం చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
చైనా, భారత్కు మధ్య అనేక సారుప్యతలున్నాయన్నారు. ప్రపంచంలో 600 రాజకీయపార్టీలతో చైనా కమ్యూనిస్టు పార్టీ స్నేహ సంబంధాలు కొనసాగిస్తోందన్నారు. ఈ సందర్భంగా టీడీపీ బృందాన్ని చైనాకు ఆహ్వానించారని ఆయన పేర్కొన్నారు.
ఏపీ అభివృద్ధికి చైనా సహకరిస్తుంది: మంత్రి రావెలకిషోర్బాబు
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి అభివృద్ధికి సహకరిస్తామని చైనా ప్రభుత్వం హామీ ఇచ్చిందని మంత్రి రావెల కిషోర్ బాబు తెలిపారు. సోమవారం మంత్రి రావెల కిషోర్ బాబు మీడియాతో మాట్లాడారు. చైనా సాంకేతిక పరిజ్ఞానం, అనుభవం ఏపీ రాజధాని అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చైనా ప్రభుత్వం, సంస్థలు ముందుకొస్తున్నాయన్నారు. ప్రజలకు ఏ విధంగా సేవ చేయవచ్చనే అంశంపై చైనా కమ్యూనిస్టు పార్టీ నేతలతో చర్చించామని ఆయన పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో చైనా మంత్రి చెంగ్ ఫెంజియాంగ్ బృందంతో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, రావెలకిషోర్బాబు తదితరులు పాల్గొన్నారు.