కేసీఆర్ పిచ్చితుగ్లక్, మంత్రదండం లేదు: బాబు, నిలదీత
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన మండిపడ్డారు. కేసీఆర్ పిచ్చి తుగ్లక్లా వ్యవహరిస్తున్నారని విరుచుకు పడ్డారు. కేసీఆర్ ప్రవర్తిస్తున్న తీరు ఏమీ బాగోలేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇంజనీరింగ్, మెడికల్ అడ్మిషన్ల (ఎంసెట్)కు పరీక్ష జరిగిందని అందుకే ఇరురాష్ట్రాల విద్యార్థులు నష్టపోకుండా ఉమ్మడిగానే కౌన్సిలింగ్ నిర్వహిద్దామని ప్రతిపాదించామని, దీనికి కేసీఆర్ నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు. కేసీఆర్ పద్ధతి వల్ల రెండు రాష్ట్రాల విద్యార్థులు నష్టపోతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
విభజన తర్వాత పదేళ్లు ఉమ్మడి వ్యవహారాలు నడిపేందుకు అంగీకరించినా ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పిచ్చి తుగ్లక్ మాదిరిగా వ్యవహరిస్తున్నారన్నారు. కౌన్సెలింగ్ దగ్గర నుండి అన్ని అంశాల్లోనూ వివాదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

బాబుకు చేదు అనుభవం
జిల్లాల పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురయింది. కొన్నిచోట్ల రుణాల మాఫీపై రైతులు, మహిళలు బాబును నిలదీశారు. ఒకచోట కాన్వాయ్ను అడ్డగించి, రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరెంటు విషయంలో కూడా సమస్యలు మరింత పెరిగాయని నిలదీశారు.
హామీలు ఇచ్చి ఇప్పుడు డబ్బుల్లేవనడం ఏమిటని పలువురు అడిగారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ సమస్యల వలయంలో చిక్కుకున్నప్పుడు వాటి పరిష్కారానికి కొంత సమయం పడుతుందని, తన వద్ద మంత్రదండం లేదని, ఓపికగా ఉండాలంటూ హితవు పలికారు.












Click it and Unblock the Notifications