పరిటాల హత్య నుంచి: జగన్ ఫ్యామిలీని ఏకేసిన బాబు, 'కడప' అలా కాదు
తిరుపతి: మహానాడు వేదిక పైన టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం మాట్లాడారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఏపీపై విభజన ఎఫెక్ట్, విభజన హామీలు, ఏపీలో ఇబ్బందులు తదితర ఎన్నో అంశాలపై మాట్లాడారు.
హింస జగన్దే
కాపులకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి వెనక్కి పోయిందన్నారు. కానీ నేను హామీ ఇచ్చి దానిని నెరవేర్చుతున్నానని చెప్పారు. కాపు ఉద్యమం సమయంలో రైలు కూడా తగలబెట్టారని మండిపడ్డారు. కాపులు హింసకు పాల్పడరని, ఈ రాష్ట్రంలో హింసకు పాల్పడేది వైయస్ కుటుంబం ఒక్కటే అన్నారు.
నాడు సూటుకేసు బాంబు పెట్టినప్పుడే ఇది చెప్పానన్నారు. పరిటాల రవీంద్ర హత్యపై అసెంబ్లీలో రాజశేఖర రెడ్డిని కూడా నిలదీశానని చెప్పారు. మొన్న కూడా కాపు ఉద్యమం సమయంలో రైలును తగలబెట్టడంలో జగన్ పాత్రేనని ఆరోపించారు. ఆయన కుటుంబానిది నేర చరిత్ర అన్నారు. కడపలో కూడా అలాంటి నేర చరిత్ర లేదన్నారు. జగన్ కుటుంబానిదే అన్నారు. ప్రజల కోసం అవసరమైతే ప్రాణాలర్పిస్తానని చెప్పారు.

జగన్ మాట్లాడటం లేదేం
కాంగ్రెస్, వైసిపిలు ఒక్కతాను ముక్కలని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా ఆ పార్టీలు కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నాయన్నారు. రాష్ట్ర అభివృద్ధికి వారు అడ్డుపడుతున్నారన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పైన ప్రతిపక్ష నేతలు ఎప్పుడైనా మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. అంటే వారి పార్టీ వారు ఉన్నారు కాబట్టే మాట్లాడం లేదని వైసిపి అధినేత జగన్ను ఉద్దేశించి అన్నారు.
వైసిపి నేతలు ఇటీవల అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం, రాజధాని తదితర అంశాలపై వారు కుట్ర చేస్తున్నారన్నారు. భోగాపురం విమానాశ్రయం పైన రాజకీయం చేస్తున్నారన్నారు. నష్టపోయినా రాష్ట్రానికి న్యాయం చేయాలనే ఆలోచన విపక్షాలకు లేదని, అందుకే నష్టం చేయాలని చూస్తున్నారన్నారు.
విపక్షాలు అడ్డుపడినా అభివృద్ధి విషయంలో బుల్లెట్ లా దూసుకు పోతానని చెప్పారు. రెండేళ్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. వైసిపి, కాంగ్రెస్ పార్టీ వంటి పార్టీల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలన్నారు. విపక్షాలు సహకరిస్తే సూచనలు తీసుకుంటాం లేదంటే దూసుకెళ్తామని చెప్పారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు కీలక బాధ్యతలు మనం నెరవేర్చాల్సిన అవసరముందని చెప్పారు. మనం చేసే పనులను ప్రజలకు చెప్పాలన్నారు. నేను కూడా కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పారు. అందరికీ గుర్తింపు ఉంటుందన్నారు.
టిడిపిలో 54 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారన్నారు. ఈ రోజు ఎవరైనా ప్రమాదంలో చనిపోతే రూ.2 లక్షలు ఇచ్చే పార్టీ టిడిపి మాత్రమే అన్నారు. పని చేసే పార్టీ టీడీపీ అన్నారు. కార్యకర్తల గౌరవం పెంచే పార్టీ టిడిపి అన్నారు. అవతలి వారు అడ్డగోలుగా విమర్శలు చేస్తే, మనం సరైన సమాధానం చెప్పాలన్నారు.
మనం శాశ్వతంగా అధికారంలో ఉంటే రాష్ట్రాన్ని అగ్రరాజ్యంలో నిలుపుదామన్నారు. నా చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు తెలంగాణ, ఏపీ వారి కోసం పని చేస్తానని చెప్పారు. ఏపీలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటన్నింటిని పరిష్కరిద్దామని చెప్పారు.
దేవుడిని దర్శించుకోండి కానీ..
ఇక్కడ తిరుపతిలో మనం ఉన్నాం కాబట్టి, మన నాయకులు, కార్యకర్తలు దేవుడిని దర్శించుకోవచ్చునని, కానీ భక్తులకు ఇబ్బంది తీసుకు రావొద్దన్నారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడాలని చెప్పారు. భక్తులు ఎప్పటికీ వస్తారని, వారికి ఇబ్బంది కలిగించవద్దన్నారు.












Click it and Unblock the Notifications