మోడీని వదిలి రా: చంద్రబాబును ఏకేసిన జగన్, కలిసి వెళ్దాం: నారాయణ
చిత్తూరు: ఒకరి ప్రాణం పోతే తప్ప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులో చలనం రాలేదా? కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుంటే చంద్రబాబు కేంద్రంలో తన మంత్రులను ఉపసంహరించుకొని రోడ్డెక్కాలని వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం డిమాండ్ చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ మునికోటి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. అనంతరం మునికోటిని కాపాడపోయి గాయాలపాలైన శేషాద్రిని పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ఏపీకి ప్రత్యేక హోదా మన హక్కు అన్నారు. ప్రత్యేక హోదా లేకుంటే రాష్ట్రానికి పరిశ్రమలు రావన్నారు. రాష్ట్రం వెనుకబడుతుందన్నారు. హోదా పైన టిడిపి నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మునికోటి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.
ఒకరు చనిపోతే తప్ప బాబులో చలనం రాలేదన్నారు. చంద్రబాబు రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకూడదని మనసులో పెట్టుకొని ప్రజలను మభ్య పెట్టేందుకు బిజెపి - టిడిపిలు ప్రయత్నిస్తున్నాయన్నారు.
మునికోటి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు జ్ఞానోదయం అయ్యేలా, కేంద్రానికి కళ్లు తెరిపించేలా కోటి ప్రాణత్యాగం చేశారన్నారు.
అలాంటి మునికోటికి ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొనాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుంటే చంద్రబాబు కేంద్రం నుంచి వైదొలగాలన్నారు. తన కేంద్రమంత్రులను ఉపసంహరించుకొని, రోడ్డు పైకి వచ్చి పోరాడాలన్నారు.
ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తామన్నారు. అందరం కలిసి ఉద్యమిద్దామన్నారు. కేంద్రం, చంద్రబాబు మెడలు వంచి అయినా ప్రత్యేక హోదా తీసుకు వస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా స్పందించేది జగన్ మాత్రమేనని, వైసిపి మాత్రమే అన్నారు.
ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఉండేందుకు కారణాలు వెతుక్కుంటున్నారని మండిపడ్డారు. 14వ ఫైనాన్స్ కమిషన్కు హోదాతో సంబంధం లేదన్నారు.
కాంగ్రెస్, బిజెపిలు కలిసి అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టాయని, ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రత్యేక హోదాతో ఫుల్ ఫిల్ చేస్తామని చెప్పారన్నారు. ఇప్పుడు మాత్రం కేంద్రం ప్రత్యేక హోదా పైన హామీని నిలబెట్టుకోవడం లేదన్నారు. పార్లమెంటులో ఇచ్చిన హామీని నెరవేర్చలా అని ప్రశ్నించారు.
కలిసి రండి: నారాయణ
ప్రత్యేక హోదా సాధనకు కృషి చేస్తున్నామని మంత్రి నారాయణ ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో అన్నారు. రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి హోదా సాధనకు ప్రతిపక్షాలు కలిసి రావాలన్నారు. ప్రత్యేక హోదా గురించి చర్చించేందుకు ఈ నెల 25న చంద్రబాబు ప్రధాని మోడీని కలవనున్నారని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు.