వివేకాది అంతఃపుర హత్యే-అవినాష్ ను వెనకేసుకొస్తారా ? సజ్జలపై చంద్రబాబు ఫైర్..
ఏపీలో వివేకానందరెడ్డి హత్య కేసులో చోటు చేసుకుంటున్న పరిణామాలు వైసీపీ, టీడీపీ మధ్యమరోసారి మాటల యుద్దానికి తెరలేపాయి.
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ ఇవాళ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని హైదరాబాద్ లో రెండోసారి ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా అవినాష్ రెడ్డి పాత్రపై సీబీఐ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో వెల్లడించిన విషయాలపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
వివేకా హత్యకేసులో సీబీఐ దర్యాప్తు టీడీపీ స్క్రిప్ట్ ప్రకారమే సాగుతోందని, కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఇందులో ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని సజ్జల ఇవాళ వెల్లడించారు. దీనిపై చంద్రబాబు స్పందించారు. వివేకా హత్యకు ముందు అవినాష్ రెడ్డి ఇంట్లో కుట్ర జరిగిందని దర్యాప్తులో తేలిందని చంద్రబాబు గుర్తుచేశారు. తమ రాజకీయాలకు అడ్డొస్తున్నాడనే వివేకాను చంపేశారని, ఇంత జరిగినా అవినాష్ అమాయకుడని వైసీపీ నేతలు చెప్తున్నారని చంద్రబాబు ఆక్షేపించారు.

వివేకా హత్యకు ముందు అవినాష్ ఇంట్లో నిందితులు కూర్చున్నారని, హత్య తర్వాత లోటస్ పాండ్ కు ఫోన్ వెళ్లిందని చంద్రబాబు తెలిపారు. ఇవన్నీ చూస్తుంటే వివేకాది అంతఃపుర హత్యేనని చంద్రబాబు తెలిపారు. వివేకా హత్యకు ముందు, తర్వాత ఏం జరిగిందో సీబీఐ దర్యాప్తులో బయటికి వచ్చిందన్నారు. దీనిపై వైసీపీ నేతలు ఇంకా అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు. మరోవైపు అవినాష్ రెడ్డిపై ఇవాళ హైదరాబాద్ లో జరుగుతున్న రెండో దఫా సీబీఐ విచారణ సుదీర్ఘంగా సాగుతోంది.












Click it and Unblock the Notifications