బలవంతపు వసూల్లొద్దు: బాబు, తనకు ప్రమోషన్ ఉండదని లోకేష్
అమరావతి: పార్టీ సభ్యత్వం కోసం ప్రజల నుంచి బలవంతంగా వసూలు చేస్తే మాత్రం సహించేది లేదని తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
ఉండవల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు కృష్ణకు రూ.100 చెల్లించి చంద్రబాబు సభ్యత్వం స్వీకరించారు. మండల పార్టీ అధ్యక్షుడు మనోజ్. .. చంద్రబాబుకు గుర్తింపు కార్డు అందజేశారు. కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు, ఎల్.రమణ, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, పార్టీ నేతలు పెద్దిరెడ్డి, బచ్చుల అర్జునుడు, టి.డి.జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు, నేతలు నీతినిజాయితీలతో ఉండాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కోసం రూపొందించిన యాప్ చాలా అద్భుతంగా పని చేస్తోందని అన్నారు. ఈ యాప్ ద్వారా సులభంగా సభ్యత్వం నమోదు చేసుకోవచ్చని తెలిపారు. స్వచ్ఛందంగా పార్టీలోకి వచ్చేవారినే ఆహ్వానించండి అని అన్నారు.
ప్రతి కుటుంబానికి 10వేల ఆదాయం వచ్చేలా చేస్తానని చంద్రబాబు అన్నారు. కార్యకర్తలు చేసే ప్రతీ పని పార్టీకి ప్రయోజనం చేకూర్చేలా ఉండాలన్నారు. తాను కూడా నిరంతరం పార్టీ కోసమే పని చేస్తున్నట్లు తెలిపారు. 80శాతం మంది ప్రజలు ప్రభుత్వానికి సానుకూలంగా రావాలని వచ్చేలా చేయాలన్నారు. ఇందు కోసం మనమంతా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

తనకు కార్యకర్తలతో అవినావభావ సంబంధం ఉందని చంద్రబాబు అన్నారు. కార్యకర్తలంతా తన కుటుంబమేనని అన్నారు. నెల రోజుల్లో సభ్యత్వ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కోటి మందిని సభ్యులుగా చేర్చాలని అన్నారు. ప్రజలను, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ నేతలు ముందుకెళ్లాలని సూచించారు.
తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు చెప్పారు. కార్యకర్తల అభివృద్ధికి మెరుగైన అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. పేదరికం లేని సమాజాన్ని రూపొందించాలని అన్నారు. ఆ ఆశయం ప్రతీ కార్యకర్తదిగా ఉండాలన్నారు. ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్, మరుగుదొడ్డి సౌకర్యం ఉండాలన్నారు. ఇంటి భద్రత, వ్యక్తిగత, ఆడ పిల్లల భద్రత ముఖ్యమని చెప్పారు.
లేదంటే ప్రమోషన్ ఉండదు: లోకేష్
తాను గతంలో నిర్ణయించిన టార్గెట్ చేరుకోవడం వల్లే తనకు జాతీయ కార్యదర్శి పదవి ఇస్తూ ప్రమోషన్ ఇచ్చారని తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ తెలిపారు. ఇప్పుడు టార్గెట్ చేరుకోకుండా ఉంటే.. తాను మళ్లీ ఆ పదవిలోనే కొనసాగాల్సి వస్తుందని అన్నారు. గతంలో 50రోజుల్లోనే 54లక్షల సభ్యత్వాలు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇప్పటి వరకు బీమా కింద రూ. 24కోట్లు చెల్లించినట్లు లోకేష్ చెప్పారు. అవినీతికి పాల్పడితే ప్రజలు సహించరని, పార్టీ కూడా భరించదని లోకేష్ స్పష్టం చేశారు. బలవంతంగా పార్టీ సభ్యులుగా ఎవర్నీ చేర్చుకోవద్దని సూచించారు. ప్రజలు వేలెత్తి చూపేలా మన కార్యకర్తలు ఉండకూడదని లోకేష్ అన్నారు.












Click it and Unblock the Notifications