చంద్రబాబు కన్నీళ్లు: ఏపీ వ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు, కార్యకర్తల ఆత్మహత్యాయత్నాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు, కార్యర్తలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టీడీపీ నేతలు అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసనలు
తననే గాక, తన కుటుంబంపైనా వ్యక్తిగత విమర్శలు చేస్తూ అవమానించారంటూ చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ కన్నీరుమున్నీరైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. గుంటూరు, నెల్లూరు, విజయనగరం, అనంతపురం, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు.
క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్, అంబటి ఇంటి వద్ద ఉద్రిక్తత
తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇంటి ఎదుట టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని నల్లపాడు, పట్టాభిపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరోవైపు, చంద్రబాబు కంటతడి పెట్టుకోవడంతో పలువురు టీడీపీ, చంద్రబాబు అభిమానులు ఆత్మహత్యకు యత్నించారు.
చంద్రబాబు అభిమానుల ఆత్మహత్యాత్నాలు
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. చంద్రబాబుపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్త నాగేశ్వరరావు పురుగుల మందు తాగాడు. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చంద్రబాబు కంటతడి పెట్టుకోవడంతోనే తాను ఆత్మహత్యకు యత్నించినట్లు నాగేశ్వరరావు తెలిపాడు. అనంతపురంలో కార్యకర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. చంద్రబాబు కన్నీరుపెట్టుకోవడంతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనలకు గురయ్యాయి. రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఉందని, ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును కించపర్చేవిధంగా వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పురుగుల మందు తాగిన కార్యకర్తలను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు టీడీపీ నేతలు. కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిని టీడీపీ నేతలు కాల్వ శ్రీనివాసులు, ప్రభాకర్ చౌదరి తెలుసుకున్నారు.
Recommended Video
వైసీపీ క్షమాపణ చెప్పాలి.. పెద్దల దిష్టబొమ్మల దహనం
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు సీఎం జగన్, మంత్రి కొడాలి నాని, ఎమమెల్యే అంబటి రాంబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. చిలకలూరిపేట టీడీపీ కార్యాలయం నుంచి ఎంఆర్టీ సెంటర్ వరకు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. విజయనగరంలో టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఆధ్వర్యంలో మౌనదీక్ష చేశారు. తన భార్యను కూడా అవమానించే విధంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు వైసీపీపై తీవ్రంగా మండిపడుతున్నారు. చంద్రబాబుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.