ఫోన్ ట్యాపింగ్ దుమారం... బాబు కొత్త కుట్రకు కారణమదే... అయినా తప్పించుకోలేరు...
విపక్షాలు,జడ్జిలు,జర్నలిస్టుల ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయడం రాజకీయ దుమారం రేపుతోంది. ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం తమకు లేదని,ఆధారాలు ఉంటే బయటపెట్టాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా హోంమంత్రి సుచరిత ఇదే అంశంపై స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు సమర్పించాలని కోరి 24గంటలు గడిచినా... ఇప్పటివరకూ ఏ ఆధారాలు సమర్పించలేకపోయారని అన్నారు.
కొత్త కుట్రకు కారణమదే.. : హోంమంత్రి సుచరిత
'చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల వెనుక ఏ కుట్ర దాగుందో రాష్ట్ర ప్రజల ముదు పెట్టడం తన విధిగా భావిస్తున్నానని సుచరిత పేర్కొన్నారు. 'అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబునాయుడు, ఆయన బినామీలు, సన్నిహితులు ఎంతటి కుంభకోణానికి పాల్పడ్డారన్నది మీ అందరికీ తెలుసు. వైసీపీ అధికారంలోకి వచ్చాక దానిపై సంబంధిత శాఖలతో విచారణ చేపట్టాం. ఆ విచారణ ఓ కొలిక్కి రావడంతో.. అందులోని నిజాలు బయటపడకుండా ఉండేందుకు చంద్రబాబు కొత్త కొట్రకు తెరలేపినట్లుగా కనిపిస్తోంది.' అని సుచరిత ఆరోపించారు.
పరిచయాలు,మీడియా సంస్థలతో కలిసి కుట్ర...
'ఇంటా,బయటా తనకున్న పరిచయాలు,మీడియా సంస్థలతో కలిసి చంద్రబాబు ఈ కుట్రకు పాల్పడుతున్నారు. అయితే దీనివల్ల ఆయన ఏదైతే ఆశిస్తున్నారో అది మాత్రం జరగదు. కేవలం అమరావతి భూముల కుంభకోణాన్ని బయటపడకుండా అడ్డుకునేందుకే పోలీస్,ప్రభుత్వ యంత్రాంగాన్ని ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో టార్గెట్ చేశారు. వారి స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఈ కుట్రపూరిత వ్యూహాన్ని అమలుచేస్తున్నారు.' అని సుచరిత ఆరోపించారు.
ప్రజలు గమనించాలని విజ్ఞప్తి..
'చంద్రబాబు తెరలేపిన ఈ కుట్రలో ఆయన మీడియా భాగస్వాములు,ఇంటా,బయటా సహకరించే కొందరు వ్యక్తులు ఉన్నారన్నది స్పష్టంగా అర్థమవుతోంది. చంద్రబాబు చెప్పినట్లుగా ఫోన్ ట్యాపింగ్ ఎక్కడా జరగలేదు. చట్టవిరుద్దమైన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందనేది అబద్ధం మాత్రమే. ప్రజలు ఈ విషయాలను గమనించాల్సిందిగా కోరుతున్నాను. అమరావతి భూముల స్కామ్ నుంచి తప్పించుకునేందుకు ఎన్ని కుట్రలకు తెరలేపినా... చంద్రబాబు దాని నుంచి తప్పించుకోలేరు.' అని సుచరిత చెప్పుకొచ్చారు.
బాబు లేఖతో దుమారం...
ప్రతిపక్ష నేతల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని మాజీ సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాయడంతో ఈ దుమారం రేగుతోంది. టెలిఫోన్ ట్యాపింగ్పై విచారణకు ఆదేశించాలని ప్రధానిని చంద్రబాబు కోరారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని... రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఆ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ఇదే వ్యవహారానికి సంబంధించి నిజానిజాలు తేల్చేందుకు సీబీఐ సిట్ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చివరకు ఏ మలుపు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.