SBIకి భారీ షాక్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం?
రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని ప్రధాన భూముల వేలం వ్యవహారం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఈ వేలంలో ఎకరానికి రూ.237 కోట్ల రికార్డు ధర పలికిన నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైకోర్టును ఆశ్రయించడంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. దీంతో SBIతో ఉన్న అన్ని ఖాతాలు, డిపాజిట్లను ఇతర బ్యాంకులకు మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
రాయదుర్గం భూముల వేలం.. తమ భూమి ఉందని కోర్టుకు వెళ్ళిన ఎస్బీఐ
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పన్మక్తలోని సర్వే నంబర్ 83/1లోని సుమారు 6.29 ఎకరాల భూమిని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ గతంలో వేలం వేసింది. గౌరా వెంచర్స్ ఎకరానికి రూ.237 కోట్ల చొప్పున బిడ్ వేసి దక్కించుకుంది. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది.అయితే, ఈ భూమిలో సుమారు 5ఎకరాలు తమవేనని SBI హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

వేలం ప్రక్రియపై హైకోర్టు తాత్కాలిక నిషేధం
2010లో రూ.13.33 కోట్లకు తమకు కేటాయించిన భూమిని ప్రభుత్వం తమ అనుమతి లేకుండా వేలం వేసిందని SBI బ్యాంక్ ఆరోపించింది. హైకోర్టు ఈ వ్యవహారంపై మూడు వారాల వ్యవధిలో స్టే ఇచ్చింది. వేలం ప్రక్రియపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ పరిణామాలపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. SBI బ్రాంచీల్లో ఉన్న ప్రభుత్వ డిపాజిట్లు, ఖాతాలు, లావాదేవీల వివరాలను సేకరించాలని అధికారులకు సూచించింది.
SBIకి 2010లో కేటాయించిన భూమిపై సర్కార్ వర్సెస్ ఎస్బీఐ
అవసరమైతే అన్ని ఖాతాలను ఇతర బ్యాంకులకు మార్చడం ద్వారా SBIకి భారీ షాక్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇది జరిగితే ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ లావాదేవీలపై ప్రభావం పడవచ్చు. ప్రభుత్వ వర్గాలు చెబుతున్న ప్రకారం, SBI 2010లో కేటాయించిన భూమిపై నిర్మాణాలు చేపట్టకపోవడంతో కేటాయింపు రద్దు చేశారు. అయితే SBI దీనిని ఆమోదించడం లేదు.
రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ
ఈ వివాదం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై కూడా ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. ప్రభుత్వం SBIపై తీసుకునే చర్యలు ఏమిటనేది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. హైకోర్టు తీర్పు ఈ వివాదానికి కీలకం అవుతుంది.












Click it and Unblock the Notifications