ఎంపిలో తరిమేస్తే: డిగ్గీపై ట్వీట్తో భగ్గుమన్న చంద్రబాబు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ పైన మండిపడ్డారు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ గత కొన్ని నెలలుగా రాష్ట్రంలోని పలు సమస్యలపై స్పందిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవల ట్విట్టర్లో అకౌంట్ ప్రారంభించిన చంద్రబాబు ట్వీట్తో అధికార కాంగ్రెసు పార్టీ పైన తన ఆగ్రహం వెలిబుచ్చారు. దిగ్విజయ్ సింగ్ను మధ్యప్రదేశ్లో తరిమి కొడితే ఆంధ్ర ప్రదేశ్కు వచ్చి పెత్తనం చెలాయిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఎపిలో పునరావాసం కోసం దిగ్విజయ్ సింగ్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అక్కడ తరిమికొడితే ఇక్కడ తిష్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అసమర్థతకు, అవినీతికి ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని విమర్శించారు. హైదరాబాదులో మూడు గంటలు, పట్టణాలలో ఆరు గంటలు, గ్రామాలలో పన్నెండు గంటల విద్యుత్ కోత విధిస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ శాఖకు అసలు మంత్రే లేరని ఎద్దేవా చేశారు.
కాగా, ట్విట్టర్లో ఇటీవల రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. బిజెపి నేతలు నరేంద్ర మోడీ, ఎల్కె అద్వానీ, సుష్మా స్వరాజ్, కాంగ్రెసు నేతలు దిగ్విజయ్ సింగ్ తదితరులు నిత్యం ట్విట్టర్లో స్పందిస్తుంటారు.