తెలుగుజాతిని కలుపుతాం, సత్తా మాకే ఉంది: బాబు
హైదరాబాద్: తెలుగు జాతిని కలుపుతామని, ఆ సత్తా తమకు మాత్రమే ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గవర్నర్ నరసింహన్తో తమ పార్టీ శాసనసభ్యులతో పాటు భేటీ అయిన తర్వాత ఆయన సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ చేసిన వ్యాఖ్యపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. అలా మాట్లాడడానికి కోదండరామ్కు ఏ అధికారం ఉందని ఆయన అడిగారు.
స్వార్థం కోసమే రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని, దాన్ని మానుకోవాలని ఆయన అన్నారు. సమస్యలు పరిష్కరించడానికి అధికారం ఇచ్చారు గానీ ఇష్టప్రకారం వ్యవహరించడానికి కాదని, తెలంగాణలో ఇష్టప్రకారం మాట్లాడడం వల్ల ఇప్పటికే ఇబ్బందులు వచ్చాయని, ఉద్యమాల వల్ల రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆయన అన్నారు. తాము మర్యాపూర్వకంగానే గవర్నర్ను కలిశామని, ప్రభుత్వాన్ని నడపడంలో సహకారం కోరామని ఆయన చెప్పారు.

రాష్ట్ర విభజన తీరు ఏ పార్టీకి కూడా సంతృప్తికరంగా లేదని, రెండు ప్రాంతాలకు న్యాయం చేయాలని తాము కోరామని, అయితే వినలేదని, తనతో కూడా మాట్లాడకుండా విభజన చేశారని ఆయన అన్నారు. విభజన పారదర్శకంగా చేయాలని తాము గవర్నర్ను కోరినట్లు ఆయన తెలిపారు. హైదరాబాదులో పెట్టుబడులు పెట్టాలని తాను అమెరికాలో పర్యటించానని, తాను చేసిన అభివృద్ధి వల్లనే తెలంగాణ ఇప్పుడు మిగులులో ఉందని ఆయన చెప్పారు. పదేళ్ల పాలనలో కాంగ్రెసు రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆయన అన్నారు రెచ్చగొట్టే ప్రకటనలు మాని బాధ్యతగా వ్యవహరించాలని ఆయన అన్నారు. పెట్టుబడులు రాకపోతే తీవ్రవాదం పెరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.
రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తామని తాము హామీ ఇచ్చామని ఆయన చెప్పారు. నరేంద్ర మోడీ, తాను హామీ ఇచ్చినట్లు తెలిపారు. చేతనైతే అభివృద్ధి కార్యక్రమాలకు ముందుకు రావాలని ఆయన తెరాసను ఉద్దేశించి అన్నారు. తాము 2019లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశఆరు. తెలంగాణలో గత చరిత్ర చూసే తమకు ఓటేశారని ఆయన అన్నారు. రెండు ప్రాంతాలను తాము అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు.
గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న ఎస్ఎం కృష్ణ తనతో పోటీ పడ్డారని, అది సాధ్యం కాకపోవడంతో తాను కూడా కలిసి పనిచేస్తానని చెప్పారని, సహకరించే పరిస్థితికి వచ్చారని, మంచి పనులు చేస్తే తెలంగాణలో తమ పార్టీ సహకారం ఉంటుందని ఆయన అన్నారు. లేకపోతే సమస్యలపై పోరాటాలు చేస్తామని చెప్పారు. తాను ఎవరినీ ఇబ్బంది పెట్టబోనని, ఎవరి పని వాళ్లు చేసుకుంటూ పోవాలని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.












Click it and Unblock the Notifications