టి అసెంబ్లీలో బాబు, జగన్!: ఊరుకోం.. రేవంత్Xకెసిఆర్
హైదరాబాద్: తెలంగాణ శాసన సభలో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిల పేర్లు వినిపించాయి. గవర్నర్ ప్రసంగంపై చర్చ సాగుతున్న సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచేందుకు కృషి చేయాలని కోరారు.
ఆయన వ్యాఖ్యల పైన స్పందించిన కెసిఆర్.. ముందు మీ అధ్యక్షుడిని (వైయస్ జగన్) ఒప్పించాలని సూచించారు. అదే సమయంలో టిడిపి నేతలకు కూడా (చంద్రబాబును ఒప్పించాలని) అదే చెబుతున్నానని తెలిపారు. మీ పార్టీలు సమస్యను తేల్చకుంటే.. మీరు పార్టీతో తేల్చుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. దీనిపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏడు మండలాలకు సంబంధించి ఎపిలో కలుపుతున్న విషయమై తెలంగాణ బిల్లులో ఉందని, దానిని రాజ్యసభలో చర్చించారని, అప్పుడు ఎంపీగా ఉన్న కెసిఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. మార్చి 1, 2014న కేంద్ర కేబినెట్ దీనిని ఆమోదించిందని, రాష్ట్రపతి ఆర్డినెన్స్ కోసం పంపిస్తే ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందని, ఆ తర్వాత పెండింగులో ఉన్న ఫైల్కు రాష్ట్రపతి ఆమోదం లభించిందని చెప్పారు. రాష్ట్ర విభజన, బౌండరీలు తదితరాలు కేంద్రం పరిధిలోనివి అన్నారు.
పోలవరం ఆర్డినెన్స్ను నేటి సిఎం.. నాటి ఎంపి కెసిఆర్ అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదో చెప్పాలన్నారు. రెండు రాష్ట్రాల్లో పార్టీ ఉన్నప్పుడు ఎవరి రాష్ట్రానికి అనుకూలంగా వారు మాట్లాడుతుండవచ్చునని, దానిని ఆసరాగా చేసుకొని.. సందర్భం వచ్చింది కదా అని రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకొని మాట్లాడుతామంటే తాము ఊరుకునేది లేదన్నారు. మీరు అధికారంలో ఉన్నందున.. శాసన సభలో పోలవరం ముంపు మండలాలు తెలంగాణలోనే ఉంచాలని అఖిలపక్షం తీర్మానం చేసి పంపించుదామన్నారు.
సందర్భం వచ్చింది కదా అని ప్రభుత్వం ఓ రాజకీయ పార్టీని, ఆ పార్టీ సభ్యుల పైన ఒత్తిడి తెచ్చే విధంగా మాట్లాడితే ఊరుకోమన్నారు. కొత్త ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తుందని భావిస్తేనే టిడిపి సహకరిస్తుందన్నారు. రాజకీయ ఆరోపణలతో ముందుకు వస్తే మాత్రం ప్రభుత్వం మొదటి రోజే సభ నడపడానికి కష్టమవుతుందన్నారు. సభ్యులం ఇక్కడ ఉన్నది సమస్యల పరిష్కారం కోసమని చెప్పారు. ఏదో అడ్డుపెట్టుకొని రాజకీయ ప్రయోజనాలు చేయవద్దని హితవు పలికారు. టిడిపి దానిని అంగీకరించదని చెప్పారు.
రేవంత్ వ్యాఖ్యలపైన స్పందించిన కెసిఆర్.. సభను ఎలా నడపాలో తమకు తెలుసునని చెప్పారు. ఎవరి బెదిరింపులకు భయపడమన్నారు. మీరు సభను ఆపితే ఆగదని చెప్పారు. మోడీపై ఒత్తిడి తెచ్చి పోలవరం ముంపు మండలాల ఆర్డినెన్స్ తెప్పించేందే చంద్రబాబు అన్నారు. పోలవరం ఆర్డినెన్స్ వ్యతిరేకిస్తూ తాను బందుకు పిలుపునిచ్చానని గుర్తు చేశారు. ముంపు మండలాలపై వైయస్సార్ కాంగ్రెసు, టిడిపిలు ఓ వైఖరి చెప్పాలన్నారు. అయితే యూపిఏ ప్రభుత్వమే అది తీసుకు వచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పారు.