చంద్రబాబునాయుడి ఇంటికి జులై మొదటివారంలో భూమిపూజ
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పం. కుప్పంకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటినుంచి చంద్రబాబునాయుడుకు ఇక్కడ సొంతిల్లు లేదు. దీంతో ఇంటిని నిర్మించుకోవాలనే ఆలోచనతో ఆయన రెండెకరాల పొలం కొనుగోలు చేశారు. కుప్పం-పలమనేరు జాతీయ రహదారి సమీపంలో శాంతిపురం మండలం కడపల్లె పంచాయితీకి చెందిన శివపురం వద్ద బాబు తన ఇంటిని నిర్మించుకోబోతున్నారు. ఈనెలాఖరులోకానీ, జులై మొదటివారంలోకానీ భూమి పూజ చేయాలని నిర్ణయించారు. చంద్రబాబునాయుడి కుటుంబ సభ్యులు మొత్తం ఈ పూజలో పాల్గొనబోతున్నారు. స్థలం రిజిస్ట్రేషన్ పూర్తికావడంతో ట్రాక్టర్తో భూమిని చదును చేసే పనులు కూడా ప్రారంభమయ్యాయి.
కుప్పం నుంచి ప్రతిసారి భారీ మెజారిటీతో గెలుపొందుతున్న చంద్రబాబును ఈసారి ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. చంద్రబాబును ఓడించగలిగితే సగం విజయం సాధించినట్లేననే భావనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు. కొద్దికాలం క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతల వెన్నుపోటు వల్లే వైసీపీ గెలవగలిగిందని స్థానిక టీడీపీ నేతలు ఆరోపణలు చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోను కుప్పంపై గ్రిప్ ఇవ్వకూడదనే ఉద్దేశంతోపాటు స్థానికుల కోరిక మేరకు చంద్రబాబు ఇక్కడ ఇల్లు నిర్మించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. కుప్పం పర్యటనకు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక నేత ఇంట్లో బస చేయాల్సి వస్తోంది. సొంతంగా ఇల్లు నిర్మించుకుంటే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా తమ సమస్యలు విన్నవించుకోవడానికి అనుకూలమవుతుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న చంద్రబాబునాయుడు సొంత ఇల్లు నిర్మించుకోవాలని నిర్ణయించుకున్నారు.