రివర్స్ గేర్ లో చంద్రబాబు ప్లాన్ : జగన్ పట్ల సానుభూతి పెరుగుతోందట
ఆకర్ష్ మంత్రం ద్వారా.. ప్రతిపక్ష వైసీపీ నేతలకు గాలం వేస్తున్న టీడీపీ ప్లాన్ బెడిసి కొడుతుందేమోనన్న ఊహాగానాలు వినిపిస్తాయి. పార్టీ మైలేజ్ ని పెంచడానికి, అదే సమయంలో వైసీపీ అధినేత జగన్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి సీఎం చంద్రబాబు వేసిన ప్లాన్.. రివర్స్ గేర్ లో వెళ్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అభివృద్ది పేరు చెప్పి వైసీపీ నేతలంతా టీడీపీకి 'క్యూ' కడుతుంటే..! తెలుగుదేశం మైలేజ్ సంగతేమో గానీ, వైసీపీ మాత్రం జనాల్లో సరిపడా సానుభూతిని మూటగట్టుకుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వైఎస్ మరణంతో జగన్ పై జనాల్లో ఏర్పడిన సానుభూతి, తాజా ఫిరాయింపులతో జనాలకు మళ్లీ జగన్ పై సానుభూతి పుట్టుకొచ్చేలా చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
నిజంగా జగన్ నాయకత్వంలో పనిచేయడం పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న నేతలకు ఇష్టం లేకపోతే.. వాళ్లను టీడీపీలోకి తీసుకొచ్చే బదులు అందులోనే కొనసాగిస్తే, వాళ్ళే వైసీపీలో ముసలం పుట్టించేవాళ్లని, అనవసరంగా టీడీపీలో చేర్చుకుని జనాలకు జగన్ పై మరింత సానుభూతి పెరిగేలా చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.