బీజేపీ యూటర్న్! అప్రమత్తమవుతున్న జగన్-పార్లమెంటులో ఆ బిల్లు వెనుక?
ఏపీలో 2019 ఎన్నికల తర్వాత మారిన రాజకీయాలకు మరోసారి యూటర్న్ తీసుకునేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడా గెల్చుకోని బీజేపీ ఇక్కడి రాజకీయాల్ని శాసిస్తున్న తీరు చూస్తుంటే ఇప్పుడు 2024 ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం కచ్చితంగా ఉండేలా ఉంది. ఇలాంటి తరుణంలో బీజేపీ వైఖరిలో వస్తున్న మార్పులు సీఎం జగన్ ను కలవరపెడుతున్నాయి. దీంతో ఢిల్లీలోనే ఆ పార్టీని ఇబ్బందిపెట్టేందుకు జగన్ సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
మారుతున్న బీజేపీ స్టాండ్?
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీతో సత్సంబంధాలు నెరుపుతున్న బీజేపీ.. తాజాగా ఎన్నికల వాతావరణం కనిపిస్తుండటంతో తన వైఖరి మార్చుకుంటోంది. తన రాజకీయాల అవసరాల మేరకు వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా వైసీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లే పరిస్ధితి లేకపోవడంతో పాత మిత్రుడు చంద్రబాబుకు ఆహ్వనం పలుకుతోంది. దీంతో చంద్రబాబుకు బీజేపీ ఇస్తున్న ప్రయారిటీ ఇప్పుడు జగన్ ను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో జగన్ వేస్తున్న అడుగులు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.
మూడు రాజధానుల నుంచి అమరావతికి
వైసీపీ సర్కార్ అమరావతి స్ధానంలో మూడు రాజధానులు తీసుకురాగానే ఆ నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కేంద్రం తరఫున అఫిడవిట్లు వేసిన బీజేపీ.. స్ధానికంగా నెలకొన్న పరిస్దితులతో ఆ తర్వాత స్టాండ్ మార్చింది. మూడు రాజధానులకు నిధులు ఎక్కడివని ప్రశ్నించడం మొదలుపెట్టింది. చివరికి అమరావతి ఉద్యమంలో బీజేపీ నేతలు ఎందుకు పాల్గొనడం లేదని అమిత్ షా ప్రశ్నించడంతో పూర్తిగా రూటు మార్చింది. ఇప్పుడు మూడు రాజధానులు కాదు అమరావతే ముద్దు అంటూ బీజేపీ నేతలు పూర్తిగా టర్న్ తీసుకున్నారు.
అలర్ట్ అయిన జగన్
రాష్ట్రంలో మూడు రాజధానుల విషయంలో తమ ప్రభుత్వానిదే నిర్ణయాధికారమని గతంలో కేంద్రం తరఫున అఫిడవిట్లు ఇచ్చి ఇప్పుడు బీజేపీ తరఫున అమరావతి ఉద్యమానికి మద్దతు ఇప్పిస్తున్న తీరును జగన్ నిశితంగా గమనిస్తున్నారు. అంతే కాదు దీనికి కౌంటర్ స్ట్రాటజీ ఏంటనే దానిపై జగన్ అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీకి సైతం కౌంటర్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అదీ ఏ పార్లమెంటులో అయితే తమ మద్దతుతో బీజేపీ పలు బిల్లులు నెగ్గించుకుందో అక్కడే ఆ పార్టీకి కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా నిన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంటులో రాజధానుల చర్చ లేపారు.
జగన్ ప్రైవేట్ బిల్లు వ్యూహం వెనుక?
మూడు రాజధానుల విషయంలో కేంద్రం తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఇప్పుడు యూటర్న్ తీసుకుందని భావిస్తున్న జగన్.. పార్లమెంటులో బీజేపీని ఎండగట్టేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే విజయసాయిరెడ్డితో రాజధానుల నిర్ణయాధికారం అసెంబ్లీకే ఇచ్చేలా రాజ్యాంగ సవరణ కోరుతూ ప్రైవేటు బిల్లు పెట్టించినట్లు సమాచారం.
ఈ బిల్లుపై చర్చ జరిగితే మాత్రం కచ్చితంగా బీజేపీ రాజధానుల విషయంలో ఆడుతున్న డ్రామా బయటపడటం ఖాయం. ఈ విషయం తెలిసి తెలిసి బీజేపీ ఈ ప్రైవేటు బిల్లుపై చర్చ విషయంలో ముందుకు వెళ్తుందా లేక తప్పించుకుంటుందా అన్నది తేలాల్సి ఉంది. అయితే బీజేపీని కాదని రాజ్యసభలో సైతం ఏ బిల్లూ నెగ్గే పరిస్ధితి లేకపోవచ్చనే అంచనాలున్నాయి. కాబట్టి చర్చలో వైసీపీ ఊహించినట్లుగా బీజేపీ ఇరుకునపడుతుందా లేక వైసీపీనే ఇరుకునపెడుతుందా అన్నది చూడాలి.