టీడీపీ-జనసేన రెండో జాబితా: ఉమ్మడి అభ్యర్థులను డిసైడ్ చేసిన హరిరామ
TDP Janasena alliance: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు అనంతరం మారిన రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తరచూ పవన్ కల్యాణ్పై లేఖాస్త్రాలను సంధిస్తోన్న హరిరామ- ఇప్పుడు మరిన్ని సూచనలు చేశారు.
ప్రస్తుతం తెలుగుదేశం- జనసేన పార్టీ.. రెండో జాబితాపై కసరత్తు సాగిస్తోన్నాయి. ఈ క్రమంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తోన్నారు. ఈ రెండు పార్టీల అభ్యర్థుల పేర్లతో కూడిన రెండో జాబితా ఈ సాయంత్రానికి వెలువడే అవకాశం ఉంది.

ఈ పరిణామాల మధ్య చేగొండి హరిరామ జోగయ్య- మరోసారి పవన్ కల్యాణ్కు లేఖ రాయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బలిజ సామాజిక వర్గానికి సీట్లను కేటాయించాలని సూచిస్తూ రాసిన లేఖ ఇది. అందులో నియోజకవర్గాలను కూడా నిర్ధారించారు. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని పోటికి దింపితే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని చర్చించారు.
బలిజ సామాజిక వర్గం ఓటుబ్యాంకు అధికంగా ఉండే రాయలసీమలోని కొన్ని నియోజకవర్గాల పేర్లను ఇందులో ప్రస్తావించారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులనూ జోగయ్యే డిసైడ్ చేశారు. తనకు ఉన్న రాజకీయ పరిజ్ఞానంతో ముందస్తు అంచనాలను వేస్తోన్నానని వివరించారు.
మదనపల్లి- శ్రీరామ రామాంజనేయులు, తిరుపతి- ఆరణి శ్రీనివాసులు, రాజంపేట- ఎంవీ రావు, అనంతపురం- టీసీ వరుణ్, పుట్టపర్తి- బ్లూమూన్ విద్యాసంస్థల అధినేత శివశంకర్, తంబళ్లపల్లి- కొండా నరేంద్ర, గుంతకల్లు- మణికంఠకు టికెట్ ఇవ్వాలని పవన్ కల్యాణ్కు హరిరామ జోగయ్య సూచించారు.
రాయలసీమలో 20 లక్షల మంది వరకు బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయంగా వారికి ఎలాంటి ప్రాతినిథ్యాన్ని కల్పించలేదని, టికెట్లనూ ఇవ్వలేదని హరిరామ అన్నారు. ఈ లోటును జనసేన తీర్చుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications