పవన్ కల్యాణ్కు హోం: అప్పుడే ఓట్ల బదిలీ
TDP Janasena alliance: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది. అన్ని పార్టీలు ఎన్నికల సంగ్రామంలో చావో రేవో తేల్చుకోనున్నాయి. అటు పోలింగ్ గడువు సమీపిస్తోంది. ఈ నెల 25వ తేదీ నాటితో నామినేషన్లను దాఖలు చేసే గడువు కూడా ముగిసింది. వాటిని ఉపసంహరించుకోవడానికి 29వ తేదీ వరకు గడువు ఉంది.
మే 13వ తేదీన పోలింగ్. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ నియోజకరవర్గాలకు ఒకే రోజున పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఈ ఎన్నికల గడువు దగ్గర పడుతోండటం అన్ని పార్టీలు కూడా జనంలోకి చొచ్చుకెళ్తోన్నాయి. ఇంటింటి ప్రచారాన్ని చేపట్టాయి.

వైఎస్ఆర్సీపీ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి తెలుగుదేశం పార్టీ సర్వశక్తులనూ ఒడ్డుతోంది. 2019 నాటి ఫలితాలను పునరావృతం కానివ్వకూడదనే పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా జనసేన- భారతీయ జనతా పార్టీతో పొత్తుపెట్టుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలోనూ భాగస్వామ్యమైంది.
ఈ పరిస్థితుల్లో కాపు బలిజ సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య మరో లేఖతో ముందుకొచ్చారు. 2019 నాటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 51 శాతం ఓటింగ్తో 151 అసెంబ్లీ, 22 లోక్సభ స్థానాలను గెలుచుకుందని గుర్తు చేశారు. 20 శాతం మంది బీసీలు, ఎస్సీ, ఎస్టీ- 16, కాపులు-8, రెడ్లు-5, ఇతరులు- 2 శాతం మేర ఓట్లు వేశాయని వివరించారు.
పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర తరువాత వైసీపీ కాపుల ఓట్ల శాతం ఎనిమిది నుంచి అయిదుకు పడిపోయిందని హరిరామ అన్నారు. ఫలితంగా 51 నుంచి 46 శాతానికి వైసీపీ మొత్తం ఓటు బ్యాంకు క్షీణించిందని పేర్కొన్నారు. అదే సమయంలో తెలుగుదేశం- జనసేన- బీజేపీ కూటమి ఓటుబ్యాంకు 54 శాతానికి పెరిగిందని, ఇందులో కాపుల ఓట్ల శాతం నాలుగు నుంచి ఎనిమిదికి పెరిగిందని విశ్లేషించారు.

కాపుల ఓట్లు కూటమికి బదిలీ కావాలంటే టీడీపీ- జనసేన మధ్య గౌరవప్రదమైన హోదాలు, అధికార పంపిణీ జరగాల్సిన అవసరం ఉందని హరిరామ జోగయ్య అన్నారు. ఆ నమ్మకాన్ని ఈ రెండు పార్టీల నాయకులు కూడా ఓటర్లల్లో కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వ్యాఖ్యానించారు.
ఎన్నికల అనంతరం ఏర్పడబోయే టీడీపీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, హోమ్ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్.. నంబర్ టూ స్థానంలో ఉండాలని, అలాంటి నమ్మకాన్ని కాపు ఓటర్లకు కలిగించాలని పేర్కొన్నారు. కూటమి ప్రబుత్వంలో నంబర్ 1 స్థానంలో చంద్రబాబు, నంబర్ 2 హోదాలో పవన్ కల్యాణ్ ఉంటారనే నమ్మకాన్ని కలిగించితే ఓట్లు సవ్యంగా బదిలీ అవుతాయని అన్నారు.












Click it and Unblock the Notifications