జగన్ టీమ్లో అంబటి రాయుడు..?!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మా నమ్మకం నువ్వే జగన్.. కార్యక్రమానికి ప్రజల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటినీ పలకరించారు ఆ పార్టీ నాయకులు. లబ్దిదారులను ముఖాముఖిగా కలుసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా స్థాయి పార్టీ అధ్యక్షులు.. ఇందులో విస్తృతంగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, జోనల్ ఇన్ఛార్జీలు, క్షేత్రస్థాయి సైనికులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటైంది. మా నమ్మకం నువ్వే జగన్.. కార్యక్రమంలో వచ్చిన ప్రజా స్పందన గురించి వివరించారు. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులపై ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.

ఈ భేటీపై వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, జోనల్ ఇన్ఛార్జీలు, క్షేత్రస్థాయి సైనికులను కలుసుకోవడం ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు. తమ సచివాలయ పరిధిలోని ప్రతి గడపను వారు సందర్శించారని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, అమలు పరుస్తోన్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకువెళుతున్నారంటూ ప్రశంసించారు. వైసీపీ కుటుంబాన్ని చూసి గర్విస్తున్నానని పేర్కొన్నారు.
వారితో కలిసిన ఫొటోలను వైఎస్ జగన్ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్కు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు లైక్ కొట్టారు. వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను ఫాలో కూడా చేస్తోన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి నాడు వైఎస్ జగన్ చేసిన ప్రసంగాలతో కూడిన రీల్స్ను తన ఇన్స్టాలో పోస్ట్ కూడా చేశారు అంబటి రాయుడు.
ఈ పరిణామాలన్నింటినీ చూస్తోంటే- అంబటి రాయుడు.. రాజకీయ అరంగేట్రం తప్పకపోవచ్చనే అనుమానాలకు మరింత బలాన్ని కల్పించినట్టయింది. భారత్ రాష్ట్ర సమితిలో చేరొచ్చంటూ మొదట్లో ప్రచారం జరిగినప్పటికీ- రాయుడి సొంత రాష్ట్రం ఏపీనే కావడం వల్ల ఇక్కడే పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే సంకేతాన్ని తాజాగా పంపించినట్టయింది. వైసీపీలో చేరొచ్చనే ప్రచారానికి తెర తీసినట్టయింది.
అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పారు అంబటి రాయుడు. ఐపీఎల్లో కొనసాగుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు ఇప్పటివరకు ఐపీఎల్లో 193 మ్యాచ్లను ఆడాడు. 4,264 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 127.44.












Click it and Unblock the Notifications