స్టీఫెన్సన్కు షాక్: చీఫ్ జస్టిస్ నిర్ణయమే కీలకమా?
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏ4 నిందితుడు మత్తయ్య దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ వ్యవహారం పైన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ పిటిషన్ దాఖలు చేయగా.. దానిని హైకోర్టు బెంచ్ సోమవారం తిరస్కరించిన విషయం తెలిసిందే. స్టీఫెన్ పైన కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కూడా న్యాయమూర్తి ఆదేశించారు.
ఈ క్వాష్ పిటిషన్ను విచారిస్తున్న బెంచ్ను మార్చాలని స్టీఫెన్ సన్ దాఖలు చేసిన నాట్ బిఫోర్ పిటిషన్ పైన న్యాయమూర్తి జస్టిస్ శివశంకర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్ కోర్టును తప్పుదోవ పట్టించేదిగా ఉందని పేర్కొన్నారు. కోర్టు ధిక్కార చట్టంలోని సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్ను ఆదేశించారు.

అదే సమయంలో తన ఆదేశాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని, ఆయన ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని, అవసరమైతే అడ్వోకేట్ జనరల్ ఈ విషయంలో కోర్టుకు సహాయకారిగా ఉండవచ్చునని జస్టిస్ తెలిపారు.
కాగా, ప్రధాన న్యాయమూర్తి ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. దీనిని ప్రధాన న్యాయమూర్తి మరో బెంచ్కు బదలాయించడమో లేక ప్రస్తుతం విచారణ జరుపుతున్న న్యాయమర్తిని తదుపరి విచారణకు కొనసాగించమనో చెప్పవచ్చు. ఒకవేళ ఇదే బెంచ్ విచారణ కొనసాగించవలసి వస్తే కేవలం న్యాయవాదులను మాత్రమే అనుమతించి విచారణ జరుపుతామని, వాదనలను చీఫ్ జస్టిస్ ముందు ఉంచుతామన్నారు.












Click it and Unblock the Notifications