వైఎస్ విగ్రహం: కూల్చిన చోటే పున: ప్రతిష్ఠ: దశమ వర్ధంతి నాడు ఆవిష్కరణ
విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడానికి ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద ఇదివరకు ఉన్న వైఎస్ విగ్రహాన్ని చంద్రబాబు ప్రభుత్వ హయాంలో స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందనే కారణాన్ని సాకుగా చూపించి, ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించినట్లు అప్పట్లో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా- ప్రభుత్వం మారిన నేపథ్యంలో.. వైఎస్ విగ్రహాన్ని అదే స్థానంలో పునఃప్రతిష్ఠించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
చురుగ్గా నిర్మాణ పనులు..
వైఎస్ విగ్రహాన్ని పున:ప్రతిష్ఠంచడానికి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు శరవేగంగా నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నారు. వచ్చేనెల 2వ తేదీన వైఎస్ దశమ వర్ధంతి నాటికి విగ్రహాన్ని ఆవిష్కరించాలని మున్సిపల్ మంత్రిత్వశాఖ లక్ష్యంగా నిర్దేశించింది. ఈ క్రమంలో- పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు నమూనాతో ఇదివరకు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో పోలీస్ కంట్రోల రూమ్ జంక్షన్ వద్ద 12 అడుగుల ఎత్తు ఉన్న వైఎస్ విగ్రహాన్ని నెలకొల్పిన విషయం తెలిసిందే.

ఈ జంక్షన్ కు వైఎస్ఆర్ కూడలి అని నామకరణం చేశారు. 2011 సెప్టెంబర్ 2న ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత.. ఆ విగ్రహాన్ని తొలగించారు. 2016 జూలై 31 రాత్రి హుటాహుటిన విగ్రహాన్ని తీసివేశారు. కృష్ణా పుష్కరాల కోసం విజయవాడకు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తుల వాహనాల రాకపోకలు అడ్డంకిగా ఉంటుందనే ఉద్దేశంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ విగ్రహాన్ని సమీపంలోనే ఉన్న అగ్నిమాపక దళ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఉంచారు. అప్పటి నుంచి ఈ విగ్రహం అక్కడే ఉంది.

దశమ వర్ధంతి నాడు ఆవిష్కరణ?
మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలు కావడం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు అందుకున్నారు. తన తండ్రి విగ్రహాన్ని పెకిలించిన చోటే ప్రతిష్ఠించాలని నిర్ణయిచారు. మొదట్లో- మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్టు, జోగి రమేష్, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తదితరులు ప్రత్యామ్నాయ ప్రదేశాలను పరిశీలించారు. బందరు రోడ్డులోని పోలీస్ కంట్రోల్ రూమ్తో పాటు పలు ప్రాంతాలను పరిశీలించారు. చివరికి తొలగించిన స్థానంలోనే నెలకొల్పాలని నిర్ణయించారు. దీనికి అవసరమైన బడ్జెట్ ను కేటాయించారు. ఫలితంగా- విగ్రహం పున: ప్రతిష్ఠ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వచ్చేనెల 2వ తేదీన వైఎస్ దశమ వర్ధంతి. ఆ సందర్భంగా తన తండ్రి విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications