Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"ఈనామ్" విధానాన్ని వ్యతిరేకిస్తూ...రోడ్డెక్కిన మిర్చి రైతులు

గుంటూరు: ఎలక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెటింగ్‌(ఈనామ్‌) విధానాన్ని వ్యతిరేకిస్తూలో గుంటూరు మిర్చి యార్డు వద్ద మిరప రైతులు రోడ్డెక్కారు. గుంటూరు మిర్చి యార్డ్ ఆసియా ఖండంలోనే అత్యధికంగా లావాదేవీలు వ్యవసాయ వాణిజ్య కేంద్రం అనే సంగతి తెలిసిందే. నగదు చెల్లింపులు నిలిచిపోవడం, మిర్చి ధరలు అనూహ్యంగా పడిపోవడంతో ఆగ్రహించిన రైతులు గురువారం ట్రేడింగ్‌ జరిగే సమయంలో రోడ్డుపై జాతీయ రహదారిపై బైఠాయింపు జరిపి ఆందోళన నిర్వహించారు.

మిర్చి కొనుగోళ్లకు సంబంధించి తమకు వెంటనే నగదు చెల్లింపులు జరపాలంటూ గుంటూరు మిర్చి యార్డ్ వద్ద మిర్చి రైతులు ఆందోళన చేపట్టారు. అయితే రోజువారీ చెల్లింపులకు అవసరమైనంత నగదు, పెట్టుబడులు తమవద్ద లేవని వ్యాపారులు చేతులెత్తేయడంతో ఆగ్రహించిన రైతులు రహదారిపై భైఠాయించినట్లు తెలుస్తోంది. మరోవైపు రెండు రోజుల క్రితం క్వింటాలు రూ.9,000 వరకూ పలికిన గ్రేడ్‌-1 రకాలైన తేజ, బ్యాడిగి ధర గురువారం ఒక్కసారిగా రూ.7,500కు పడిపోవడంపై కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల జోక్యం...ఆందోళన విరమణ...

అధికారుల జోక్యం...ఆందోళన విరమణ...

జాతీయ రహదారిపై రైతుల ఆందోళన తో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో పోలీసు అధికారులు జోక్యం చేసుకొని మార్కెటింగ్‌ అధికారులతో చర్చించారు. పాత పద్ధతిలోనే కొనుగోళ్లకు అనుమతిస్తామని వారితో ప్రకటన చేయించడంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు. అనంతరం మిర్చి వ్యాపారులతో యార్డు సెక్రటరీ ఎన్‌. శ్రీనివాసరావు సమావేశమయ్యారు. ఈనామ్‌ అమలుకు ప్రతి ఒక్కరు సహకరించాలని, కొనుగోళ్లు నిలిపేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అలాగే రైతులకు కూడా ఈ నామ్ విధానంలోనే కొనుగోళ్లు జరగాల్సి ఉందని నచ్చచెప్పినట్లు యార్డు సెక్రటరీ ఎన్‌. శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ కోన శశిధర్‌ మార్కెట్ యార్డు సెక్రటరీని తన కార్యాలయానికి పిలిపించుకొని రైతుల ఆందోళన విషయమై వివరణ కోరారు. రైతులు రోడ్డెక్కకుండా చూసుకోవాలని, లేకుంటే కఠిన చర్యలకు సిఫారసు చేస్తానని యార్డ్ సెక్రటరీని హెచ్చరించారు.

ఈనామ్...ఎందుకంటే...

ఈనామ్...ఎందుకంటే...

ఈనామ్ పథకాన్ని2017 సెప్టెంబర్ లో కేంద్రప్రభుత్వం ప్రారంభించింది. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ సిస్టమ్‌ ద్వారా దేశంలోని అన్నిమార్కెట్ యార్డులను అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. ముందుగా ఆసియాలోనే పెద్దదయిన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డును మోడల్‌గా తీసుకొని ఈ నామ్‌ను అమలు చేయడం ప్రారంభించారు. ఈ నామ్ ప్రక్రియ అంతా ఆన్ లైన్ పద్ధతిలో జరుగడం గమనార్హం. మార్కెట్ యార్డ్ లోని సరుకును దేశంలో ఎక్కడి నుండైనా కొనుగోళ్లు చేసుకోవచ్చు.

వ్యాపారులు కుమ్మక్కు కాకుండా...దళారులు లేకుండా...

వ్యాపారులు కుమ్మక్కు కాకుండా...దళారులు లేకుండా...

అయితే ఈనామ్ విధానంలో వ్యాపారులు కుమ్మక్కు కాకుండా మిర్చికి ధర నిర్ణయించాలి. దాని వల్ల దళారుల పాత్రను పూర్తిగా తగ్గించడం సాధ్యపడుతుంది. పైగా ఈ పద్ధతిలో కొనుగోలు చేసిన మిర్చికి సంబంధించిన నగదును వెంటనే బ్యాంక్‌లో జమ చేయాల్సి ఉంటుంది. దీంతో రైతుకు మంచి ధర లభించడమే కాకుండా, మధ్యవర్తుల పాత్ర అనేది లేకుండా పోతుందనే సదుద్దేశంతో కేంద్రం ఈ విధానాన్నితెచ్చింది.

అయితే అనుకున్నట్లుగా...అమలు కావడం లేదు...

అయితే అనుకున్నట్లుగా...అమలు కావడం లేదు...

పాత పద్దతిలో రైతులు తమ మిర్చిని మిర్చి యార్డ్ లోని కమీషన్ ఏజెంట్ వద్దకు చేరుస్తారు. ఆ కమీషన్ ఏజెంట్ ఈ మిర్చిని ఎగుమతి వ్యాపారులకు చూపించి ధర నిర్ణయిస్తాడు. ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారికే కమీషన్ ఏజెంట్ రైతు అనుమతితో అమ్ముతాడు. అయితే ఈ విధానంలో వ్యాపారులు కుమ్మక్కై ధర రాకుండా చేయడం, కమీషన్ చెల్లించాల్సి రావడం, కొలతల్లో రైతులకు నష్టం చేయడం వంటి అంశాలున్నాయి. అయితే కేంద్రం తీసుకొచ్చిన ఈ నామ్‌లో అలాంటి అవకాశం ఉండదు. అయితే దీనివల్ల కమీషన్ ఏజంట్లుకు, దళారులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నందున వారే ఈ విధానాన్ని ఎత్తేసేలా సమస్యలు సృష్టిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

అవగాహన కల్పించాలి...సామరస్యంగా వ్యవహరించాలి...

అవగాహన కల్పించాలి...సామరస్యంగా వ్యవహరించాలి...

అయితే ఈనామ్ విధానంపై రైతులు,వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లకు ఉన్నఅపోహలను తొలగించేందుకు వారికి ఈ విధానంపై అవగాహన కల్పించే ప్రయత్నం
చెయ్యకుండా నేరుగా విధానం అమలు లోకి తెచ్చేశారని, ఇది సమస్యలకు దారితీసినట్లు రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. బలవంతంగా రుద్దినట్లు కాకుండా సౌలభ్యం వివరిస్తే సరిపోయేదానికి, అధికారులు అహంకారధోరణితో వ్యవహరిస్తే రైతులకు నష్టమే కాని లాభం ఉండదంటున్నారు. మరోవైపు
వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు కూడా తాము ఈ నామ్‌ విధానానికి వ్యతిరేకంకాదని అంటున్నారు. గతంలో ప్రవేశపెట్టిన ఈ ట్రేడింగ్ విధానం వలన కూడా అనేక ఇబ్బందులు తలెత్తాయని వారు గుర్తు చేస్తున్నారు. ఈనామ్ అమలు చేయడానికి కేంద్రం కొన్ని నిబంధనలు విధించిందని, అయితే ఆ నిబంధలను పాటించకుండా ఈనామ్ ను అమలు చెయ్యడాన్నే తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

 ఈ నామ్ విధానం...సాంకేతిక సమస్యలు...

ఈ నామ్ విధానం...సాంకేతిక సమస్యలు...

ఈ నామ్ విధానంలో వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను నిర్దేశించటానికి ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని, ఈ ల్యాబ్ కు 5 నుండి 10 ఎంబిపిఎస్ హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉండాలని, అది తప్పనిసరి అని వ్యాపారులు, కమీషన్ ఏజంట్లు చెబుతున్నారు. ఈ విధమైన మౌళిక సదుపాయాలు లేకుండా ఈనామ్ అమలు చేయడం ద్వారా అందరికీ నష్టమే తప్ప ఎవరికీ లాభం ఉండదంటున్నారు. పైగా ఈ ఈనామ్ గురించి అవగాహన కల్పించేందుకు అధికారుల వైపు నుంచి ఏ విధమైన ప్రయత్నం జరగలేదని ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఈ నామ్ విధానం వల్ల తలెత్తుతున్న సమస్యలను గుర్తించి వాటి నివారణకు చిత్తశుద్దితో ప్రయత్నిస్తే అందరికీ ప్రయోజనకరమని అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+