జగన్ను పట్టించుకోవద్దు, 1994 నుండే : చినరాజప్ప
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పేవన్నీ అసత్యాలేనని, ఆయన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆదివారం అన్నారు. ఆయన తూర్పు గోదావరి జిల్లాలో మాట్లాడారు. జగన్కు 1994 నుండి నేర చరిత్ర ఉందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వ పాలనా చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు రాజన్న దొర, నారాయణ స్వామి, సంజీవయ్యలు హైదరాబాదులో ప్రశ్నించారు.
అసెంబ్లీలో ప్రతిపక్షానికి కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరా అని ప్రశ్నించారు. ప్రజలకు అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, ఆ హామీల పైన ప్రశ్నిస్తామనే సభలో తమ పైన దాడికి దిగుతోందని విమర్శించారు.
వంగవీటి మోహన రంగా హత్య పైన, ఎన్టీ రామారావు మరణం పైన మాట్లాడే ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉందా అని సవాల్ చేశారు. ఈ మూడు నెలల్లో జరిగిన రాజకీయ హత్యల పైన సభలో చర్చ పెడితే అధికార పక్ష సభ్యులు తప్పుదారి పట్టిస్తున్నారని, సభాపతి వారిని నియంత్రించడం లేదన్నారు.