‘నాయకుడంటే ఇలా.. చినరాజప్ప రాజీనామాకు సిద్ధపడితే, బాబు వారించారు’
హైదరాబాద్/తూర్పుగోదావరి: రాజమండ్రి తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం చినరాజప్ప రాజీనామా చేసేందుకు సిద్ధపడితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వారించారని తెలుగుదేశం పార్టీ ఎంపీ మురళీ మోహన్ తెలిపారు. ఆయన శనివారం జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడారు.
సంక్షోభం వచ్చినప్పుడు నాయకత్వం ఎలా ఉండాలో చంద్రబాబు పుష్కరాల సమయంలో చూపించారని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ ప్రశంసించారు. ‘పుష్కరాల తొలిరోజే తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత హోం శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం రాజప్ప.. సంఘటనకు బాధ్యత తీసుకొని తాను రాజీనామా చేస్తానన్నారు' అని చెప్పారు.
చంద్రబాబు ఆయనను వారించి, స్వయంగా ప్రజల ముందుకు వచ్చి జరిగిన సంఘటనకు బాధ్యత తనదని.. తనను క్షమించాలని కోరారని మురళీ మోహన్ చెప్పారు.
ఏదైనా సంఘటన జరిగితే ఎవరో ఒకరిపై తోసేసి వారిని బలి చేసే రోజులో.. చంద్రబాబు ఆ పని చేయకుండా బాధ్యత తన నెత్తిపై వేసుకొన్నారని తెలిపారు. నాయకుడు ఎలా ఉండాలో మాకు ఆ సంఘటన నేర్పిందని వివరించారు.