మారేడుమిల్లి ప్రయాణికులకు సర్కార్ అలర్ట్..! తాజా ఉత్తర్వులు..!
ఏపీలోని అద్బుతమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి(Maredumilli)కి ఏటా భారీ ఎత్తున పర్యాటకులు వస్తుంటారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఎత్తైన కొండల మధ్య పచ్చదనం, గలగలా పారే జలపాతాలు, వ్యూ పాయింట్లు ఇక్కడ ఉన్నాయి. దీంతో ప్రకృతి ప్రేమికులు ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి తీరాలని భావిస్తుంటారు. అయితే వీటి మాటునే ఇక్కడ విషాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జరిగిన బస్సు ప్రమాదం కూడా అలాంటిదే.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తులసిపాకలు ఘాట్ రోడ్లో తాజాగా తెల్లవారు జామున ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డుపై నుంచి లోయలోకి బస్సు పడటంతో 10 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇందులో ప్రయాణిస్తున్న మరో 20మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ప్రయాణాలపై భయపడే పరిస్ధితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చింతూరు నుంచి మారేడుమిల్లి వెళ్లే ఘాట్ రోడ్డులో (Chintur-Maredumilli Ghat Road) ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రాత్రిపూట ఈ రోడ్డులో ప్రయాణాల్ని నిషేధించింది.

ఈ ఘాట్ రోడ్డుపై ప్రతీ రోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రయాణాల్ని నిషేధించారు. కాబట్టి ఇటువైపు వెళ్లే వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు కోరారు. ఈ మేరకు చింతూరు ఐటీడీఏపీవో శుభం నోక్వాల్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం తాజా ఆదేశాలతో ఈ ఘాట్ రోడ్డుపై రాత్రి వేళ భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్ కు వచ్చే వాహనదారులకు ఇబ్బందులు తప్పేలా లేవు. అయితే ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాబట్టి మారేడుమిల్లి వైపు వెళ్లే ప్రయాణికులు చీకటి పడ్డాక ఈ మార్గంలో ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని అధికారులు చెప్తున్నారు.












Click it and Unblock the Notifications