మోడీ-అమిత్ షా కన్నా చిరంజీవి, జూనియర్ ఎన్టీఆరే తెలివైనోళ్లు!!
ఏపీ, తెలంగాణలో రాజకీయంగా ఎదగడానికి భారతీయ జనతాపార్టీ తన ప్రయత్నాలు తాను చేస్తోంది. పార్టీకి కొత్తగా జవసత్వాలందించడానికి ప్రజల్లో పేరున్న సెలబ్రిటీలను పార్టీలోకి ఆహ్వానిస్తే వేగంగా ఎదగవచ్చని అంచనా వేసింది. అయితే తెలంగాణలో పుంజుకున్న బీజేపీ ఏపీలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది.

పెదవి విప్పని జూనియర్
జూనియర్ ఎన్టీఆర్, అమిత్ షా మధ్య భేటీ రాజకీయం జరిగిన సంగతి తెలిసిందే. కేంద్ర హోం మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి గౌరవ సూచకంగానే కలిసినట్లు జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు స్పష్టతనిచ్చారు. ఆ భేటీపై రాజకీయంగా పలు వార్తలు వచ్చాయి. పార్టీ నేతలంతా తమకు జూనియర్ ప్రచారం చేస్తారని ప్రకటించారు సోము వీర్రాజు లాంటి నేతలు కూడా జూనియర్ తమ స్టార్ క్యాంపెయినర్ అని చెప్పారు. కానీ ఆయన తన సినిమాలు తాను చేసుకుంటున్నారు. ఇంతవరకు పెదవి విప్పలేదు.

చిరంజీవిపై మోడీ ప్రశంసల జల్లు
నరేంద్రమోడీ అవకాశం ఉన్నప్పుడల్లా చిరంజీవిపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. భీమవరం సభకు ఆహ్వానం పలకడమేకాకుండా ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆప్ ద ఇయర్ 2022 అవార్డుకు ఎంపికైనందుకు ఆయనపై మోడీ ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపుతో చిరంజీవిని గౌరవించినట్లైంది. రాజకీయ విశ్లేషకలు మాత్రం ఏపీ, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ఈ అవార్డును చిరంజీవికి ఇవ్వడంద్వారా రాజకీయ లాభం ఆశించారంటూ విశ్లేషిస్తున్నారు. అంత గొప్ప అవార్డు ఇచ్చినా చిరంజీవి ఎక్కడా బయటపడటంలేదు. నింపాదిగా తన సినిమాలు తాను చేసుకుంటున్నారు. ఆయన తమ్ముడు కూడా రాజకీయపార్టీ పెట్టాడు కాబట్టి మొదటి ప్రాధాన్యత దానికేనని పరోక్షంగా చెప్పేశారు.

మరేదైనా వ్యూహం అమలు చేస్తుందా?
సెలబ్రిటీలను, సూపర్ స్టార్లను ఆకట్టుకోవడంద్వారా పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు బీజేపీ తరుచుగా చేస్తుంటుంది. ఎక్కడైతే తాము బలహీనంగా ఉన్నామో గుర్తించి అక్కడ ఉన్న స్టార్ల ద్వారా బలోపేతమవడానికి వ్యూహం పన్నేది. జనసేనతో పొత్తుంది. ఆ పార్టీ అధినేత కూడా సూపర్ స్టారే. కానీ జనసేనను బీజేపీలో విలీనం చేయమని ఎప్పటి నుంచో కోరుతున్నారుకానీ సున్నితంగా తిరస్కరిస్తూ వస్తున్నారు పవన్ కల్యాణ్. తాను 25 ఏళ్లు రాజకీయం చేయడానికి వచ్చానేకానీ విలీనానికి కాదని బీజేపీ అధినాయకత్వానికి కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశారు. పార్టీ ఎంపిక చేసుకున్న సెలబ్రిటీలు తమ పనుల్లో తాము బిజీగా ఉన్నారు. వారివల్ల ఏమీ కలిసిరాలేదని, మరేదైనా వ్యూహం అమలుచేస్తారేమో చూడాలని విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications