మోడీ! సిగ్గుపడు: రెచ్చిపోయిన చిరంజీవి, విదేశీ బాబు: రాహుల్ సెటైర్
అనంతపురం: తన పాలన పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సిగ్గుపడాలని, అవమానపడాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి నిప్పులు చెరిగారు. చిరంజీవి అనంతపురం జిల్లా కొండకమర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.
ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయన, ఇతర రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఓబులదేవరచెరువు నుంచి కొండకమర్ల వరకు పదికిలోమీటర్లు నడిచారు. అనంతరం కొండకమర్లలో మాట్లాడారు.
మొదట చిరంజీవి మాట్లాడారు. రాష్ట్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, పేదలకు.. నేనున్నానని చెప్పేందుకే మన యువనేత రాహుల్ గాంధీ వచ్చారని చిరంజీవి అన్నారు. మోడీగారి నాయత్వంలో ఎన్డీయే ప్రభుత్వం చేస్తున్న నిర్వాకం మనకు తెలుస్తోనే ఉందన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చారన్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలకు చేతి నిండా పని దొరికేదని, ఇప్పుడు అది లేక ఇక్కడి నుండి నాలుగు లక్షల మంది వలస వెళ్లారన్నారు. దీనికి మోడీ సిగ్గుపడాలని, అవమానపడాలన్నారు. రాష్ట్రంలోని ఇదే పరిస్థితి అన్నారు.
తమది పేదల ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అని మోడీ చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. ఎవరు కూడా అధైర్యపడవద్దని సూచించారు. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ భరోసా ఇచ్చిన ప్రతిసారి ఈ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు.
విదేశీ బాబుగా మారారు: రాహుల్ గాంధీ
ఎన్నికలకు ముందు చంద్రబాబుగా ఉన్న ముఖ్యమంత్రి ఎన్నికల తర్వాత విదేశీ బాబుగా మారిపోయారని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. మోడీ, చంద్రబాబులకు దేశాలు తిరిగేందుకే సమయం సరిపోతుందన్నారు. ఇంత ఎండలో వచ్చినందుకు ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.