వైయస్ మృతి: జగన్పై చిరంజీవి సంచలనం వ్యాఖ్యలు!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చీఫ్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు! ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఈటివి2కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... జగన్ తన మద్దతు కోసం ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.
వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన రోజున జగన్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి మద్దతు కోరుతూ కొందరిని తన వద్దకు పంపించారని చిరంజీవి ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. జగన్ కోరినప్పుడు తానేం చెప్పానో ఈ ఇంటర్వ్యూలో చిరు వెల్లడించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయమై కూడా స్పందించారు.
కాగా, 2009లో వైయస్ రాజశేఖర రెడ్డి మృతి చెందినప్పుడు వైయస్ జగన్ తాను ముఖ్యమంత్రి కావడం కోసం సంతకాలు సేకరించినట్లుగా విపక్షాలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, జగన్కు మద్దతుగా అభిమాన నేతలు మాత్రమే సేకరించారని జగన్ పార్టీ చెబుతోంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై అధిష్టానంతో చిరంజీవి విబేధించిన విషయం తెలిసిందే. కనీసం హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని చిరంజీవి అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. అయితే అధి నెరవేరలేదు.