చెత్తతో సమానం: కాంగ్రెస్ను వీడిన నేతలపై చిరంజీవి
కర్నూలు: ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన నాయకులపై కేంద్రమంత్రి చిరంజీవి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన గురువారం బస్సుయాత్ర ముగింపు సందర్భంగా కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మహా సముద్రం లాంటిదని అన్నారు.
చివరి వరకు పార్టీలో ఉన్నత పదవులు అనుభవించి పార్టీని వీడిన వారు చెత్తతో సమానమని ఆయన దుయ్యబట్టారు. పాత నీరు పొతే కొత్త నీరు వచ్చినట్లుగా కాంగ్రెస్ పార్టీకి కొత్త నాయకులు వస్తారని చెప్పారు.
లక్ష్యం నెరవేరింది: రఘువీరా రెడ్డి
తాము చేపట్టిన బస్సు యాత్ర లక్ష్యం నెరవేరిందని, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కలిగిందని ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనపై కార్యకర్తల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేస్తామని ఆయన అన్నారు.
కర్నూలులో బస్సు యాత్ర ముగిసిన సందర్భంగా ఆయన మాట్లడుతూ.. తాము చేపట్టిన తొలి ప్రయత్నం బస్సు యాత్ర అని చెప్పారు. రెండు మూడు రోజుల్లో కొత్త కార్యాచరణతో ముందుకు వస్తామని చెప్పారు. ఏప్రిల్ తొలి వారంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తామని రఘువీరా రెడ్డి తెలిపారు.