బాబుకి ఆఖరిపోరాటం, జగన్కోసం వస్తే షాకయ్యా: చిరు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు ప్రచార సారథి చిరంజీవి తనదైన శైలిలో స్పందించారు. చిరంజీవి ప్రముఖ తెలుగు ఛానల్ ఇంటర్వ్యూలో స్పందించారు.
ఈ సార్వత్రిక ఎన్నికలు జగన్కు రక్షణ పోరాటం అయితే, చంద్రబాబుకు ఆఖరి పోరాటమని ఎద్దేవా చేశారు. ఈసారి ఓడిపోతే మరెప్పుడూ ముఖ్యమంత్రిని కాలేనని చంద్రబాబు పోరాడుతున్నారన్నారు. అలాగే జగన్ తన అక్రమ సంపాదనను రక్షించుకునేందుకు, తనపైనున్న కేసుల నుంచి రక్షణ పొందాలని, తన అవినీతి నుంచి రక్షణ పొందడానికి రక్షణ పోరాటం చేస్తున్నారన్నారు.
వైయస్ మరణించి 24 గంటలు గడవక ముందే ఆయన అంతిమ సంస్కారం జరగకుండానే తక్షణం ముఖ్యమంత్రిగా జగన్ను చేద్దామంటూ 20 మంది ఎమ్మెల్యేలు తన మద్దతు కోరారని చెప్పారు.
తాను పిఆర్పీ నేతగా, ప్రతపక్ష నేతగా షాక్కు గురై ఉన్నానని, వారి వాదనతో మరింత దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. తన వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలతో పదవుల పంపకానికి ఇది సరైన సమయం కాదని చెప్పానని, అయినా ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకు అధిష్ఠానం ఉందని, అది నిర్ణయిస్తుందని చెప్పానట్లు తెలిపారు.