హామీ ఇచ్చాం: చిరు, చంద్రబాబుపైనే 'కాపు' విశ్వాసం!
హైదరాబాద్: 2004 కాంగ్రెసు ఎన్నికల మేనిఫెస్టోలో కాపులను బిసిలలో చేర్చుతామని హామీ ఇచ్చారని, ఈ హామీని నెరవేర్చినట్లయితే ఈ కులాల మద్దతు కాంగ్రెసు పార్టీకి ఉంటుందని, వారిది న్యాయమైన డిమాండు అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి సోమవారం అన్నారు. తెలగ, బలిజ, కాపు రిజర్వేషన్ సాధన సమితికి చెందిన ప్రతినిధులు ఆయనను క్యాంప్ కార్యాలయంలో కలిశారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులాలను వెనుకబడిన కులాల జాబితాలో చేర్చాలన్న డిమాండ్ న్యాయమైనదన్నారు. కాపులను బిసిల్లో చేర్చాలన్న డిమాండ్ ఎంతో కాలంగా ఉందన్నారు. రాష్ట్రంలో బిసి కులాలకు ఉన్న రిజర్వేషన్లకు, వారి ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా రిజర్వేషన్ల శాతాన్ని తమిళనాడు తరహాలో 69 శాతానికి పెంచడం ద్వారా కాపులకు బిసి హోదా కల్పించవచ్చన్నారు.
బాబు డిక్లరేషన్ పైన కాపు నేతలు
కాపులను బిసిల్లో చేర్చేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డిక్లరేషన్ ప్రకటించడంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాపునాడు సదస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు నారాయణ స్వామి వెల్లడించారు. విజయవాడ గ్రామీణ మండలం ఎనికేపాడులోని టంకసాల కల్యాణమండంలో సోమవారం కోస్తాజిల్లాల కాపునాడు నాయకుల సమావేశం జరిగింది.
టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొండా ఉమామహేశ్వర రావు ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇటీవల చంద్రబాబు ఒంగోలు సభలో కాపులకు డిక్లరేషన్ను ప్రకటించారు. ఈ నేపథ్యంలో కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి, ప్రకాశం జిల్లాల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ పదేళ్లుగా మేనిఫెస్టోలో మాత్రమే కాపుల సంక్షేమాన్ని చూపిస్తూ కాపులను వంచిస్తున్న కాంగ్రెస్ను ఇక ఏమాత్రం నమ్మే పరిస్థితుల్లో కాపులు లేరని ఆయన స్పష్టం చేశారు.