నిలబడ్తారా, మాటవింటారా?: పవన్పై చిరు 'ఫ్యాన్' దెబ్బ
హైదరాబాద్: తన సోదరుడు, జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ను ఢీకొనేందుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చీఫ్ చిరంజీవి సిద్ధమయ్యారు. పవన్కు అయినా, చిరుకు అయినా తమ అభిమానులే కీలకం! అయితే, చిరంజీవి కాంగ్రెసు పార్టీ నేతగా ఉన్నందున... పవన్కు అభిమానుల మరింత కీలకమనే చెప్పవచ్చు. ఆ అభిమానులను కాంగ్రెసు పార్టీ బుట్టలో వేసుకునే ప్రయత్నాలు చేస్తోంది.
రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం చిరంజీవి సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తుంటే... అన్నతో రాజకీయంగా విభేదిస్తున్న పవన్ పోటీకి దూరంగా ఉంటున్నప్పటికీ.. గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి ఓటేయాలని తన అభిమానులకు, రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో సీమాంధ్రలో కాంగ్రెసు, బిజెపిల మధ్య పోటీ చిరు వర్సెస్ పవన్గా మారింది.

పవన్ జనసేన పార్టీ నేపథ్యంలో మెగా అభిమానులు ఎక్కువ మంది పవర్ స్టార్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, రామ్ చరణ్ తేజ పుట్టిన రోజు సందర్భంగా కొందరు మెగా అభిమానులు మాత్రం చిరు వైపు ఉంటామని తీర్మానం చేశారు. దీనిని ఈ రోజు వారు చిరంజీవికి అందజేశారు. తాము మీ వెంటే ఉంటామని చిరుకు చెప్పారు. అభిమాన సంఘాల నాయకులు చిరంజీవి వైపు ఉన్నప్పటికీ... ఎక్కువమంది అభిమానులు మాత్రం పవన్ వైపే మొగ్గు చూపుతున్నారనే వాదన ఉంది.
పవన్, ఆయన పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయక పోవడం అనే అంశాన్ని తీసుకొని కాంగ్రెసు పార్టీ మెగా అభిమానులను దువ్వుతోంది. ఈ రోజు అభిమానులతో భేటీ అనంతరం రఘువీరా రెడ్డి మాట్లాడుతూ... చిరు అభిమానులు, మాజీ పిఆర్పీ నాయకులు టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని, వారి పేర్లను తాము పరిశీలిస్తామని చెప్పారు. పవన్ పోటీలో లేనందున అటువైపు వెళ్లిన మెగా అభిమానులను ఈసారికి కాంగ్రెసు వైపు రప్పించే ప్రయత్నాల్లో ఇది భాగమంటున్నారు.
ఫలించేనా?
పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన ఈ ఎన్నికల బరిలో నిలబడితే బాగుండునని చాలామంది అభిమానులు భావిస్తున్నారు. పవన్ పార్టీ బరిలో నిలిస్తే అభిమానులు చిరు వైపు కాకుండా పవన్ వైపు వెళ్లే వారని కానీ, ఇప్పుడు జనసేన పోటీ చేయడం లేదు.
కాబట్టి పవన్ సూచించినట్లుగా ఇతర పార్టీలకు ఓటు వేసే బదులు చిరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమున్నందున కాంగ్రెసు పార్టీకే ఓటు వేయవచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఇది ఎంత వరకు సాధ్యమనేది చూడాల్సి ఉంది. అభిమానులు చిరు కోసం కాంగ్రెసుకు అండగా నిలబడతారా.. పవన్ మాట విని మోడీకి ఓటేస్తారా అనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అభిమానులను కోరిన చిరు
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ విజయానికి కృషి చేయాలని చిరంజీవి తన అభిమానులను కోరారు. చిరు జిల్లాలకు చెందిన అభిమాన సంఘాల నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి ఆయన పలు సూచనలు చేశారు. అభిమానులు కాంగ్రెసు పార్టీతో కలిసి పని చేయాలన్నారు.












Click it and Unblock the Notifications