జగన్ వైపు ధర్మాన: చిరంజీవి వర్గం హవా, కిల్లి అండ
శ్రీకాకుళం: మాజీ మంత్రి, ఇటీవలె కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన ధర్మాన ప్రసాద రావు వర్గం అనంతరం.. ఇక నుండి శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి వర్గం హవా కొనసాగనుంది! గత కొన్నేళ్లుగా శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన వర్గానిదే హవా.
ఇప్పుడు ధర్మాన సహా ఆయన వర్గం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లిపోయింది. ధర్మానతో పాటు జిల్లా కాంగ్రెసు పార్టీ కమిటి అధ్యక్షులు, మాజీ జిల్లా అధ్యక్షులు తదితరులు జగన్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
తాజాగా జిల్లా కాంగ్రెసు కమిటీ అధ్యక్షులుగా డోలా జగన్మోహన్ రావు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు చిరు వర్గానికి చెందిన నాయకులు అండగా ఉన్నారు. ఆయన జిల్లా సహకార కేంద్రీయ బ్యాంకు అధ్యక్షులుగా కూడా ఉన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేసి... విలీనం తర్వాత కాంగ్రెసు నాయకులుగా ఉన్న ముస్తాక్ మహమ్మద్, కరుణాకర్, నాగేశ్వర రావు వంటి పలువురు నేతలు ఆయనకు మద్దతుగా ఉన్నారు.
డోలాతో కలిసి వారు జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా పని చేస్తున్నారు. డోలాకు మరో కేంద్రమంత్రి కిల్లి కృపారాణి అండదండలు కూడా ఉన్నాయి. వీరంతా కలిసి పార్టీ పైన దృష్టి సారించారు. కిల్లి కృపారాణి కుటుంబానికి చిరుతో మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలోను ఆమె చిరును పొగడ్తలతో ముంచెత్తిన సందర్భాలు ఉన్నాయి.