గుంటూరులో కలరా విజృంభణ:ముగ్గురు మృతి...వందలమందికి అస్వస్థత
గుంటూరు: గుంటూరు నగరవాసులు కలరా విజృంభణతో భయోత్పానికి గురవుతున్నారు. ఇప్పటికే ఈ అతిసార వ్యాధి బారిన పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోగా...నగరవ్యాప్తంగా పలు ఆస్పత్రులలో సుమారు 300 మంది ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వైద్య శాస్తంలో ఎక్యూట్ డయేరియల్ డిసీజ్ గా పేర్కొనే కలరా వ్యాధి గుంటూరు నగరాన్నివణికిస్తోంది. కలుషిత నీటి కారణంగా ప్రబలిన ఈ ప్రమాదకర వ్యాధి ఇప్పటికే ముగ్గురిని బలిగొంది. గుంటూరు నగరంలోని ఆనందపేట, సంగడిగుంట, పాతగుంటూరు ప్రాంతాలకు చెందిన 300 మంది వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ వ్యాధి బారినపడి గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నకుమార్ (35), సయ్యద్ సహీనా (28), మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయారు. పలు ఇతర ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు గోరంట్లలోని గవర్నమెంట్ ఫీవర్ హాస్పిటల్ లో ఇలా ఒకేసారి పెద్ద సంఖ్యలో పేషెంట్లు చికిత్స కోసం రావడంతో మంచాలు సరిపోక అరుగుపైనో, నేలమీదో పడుకోబెట్టి సెలైన్లు ఎక్కించడం చేస్తున్నారు.
ఇలా ఒక్కసారిగా ప్రజలు పెద్ద సంఖ్యలో కలరా బారిన పడటానికి మున్సిపల్ డ్రైనేజీ పైపులైన్ల లీకేజీనే కారణమని...మంచినీరు కలుషితం కావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఆరోగ్య శాఖ ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా పరిస్థితి భీతావహంగా మారిపోవడంతో ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దించినట్లు, రోగుల సంఖ్యకు అనుగుణంగా ఈ వైద్య బృందాల సంఖ్య కూడా పెంచనున్నట్లు తెలిసింది.