Rebel MP Raghurama case:ఈ నెల 28 వరకు రిమాండ్..కోర్టులో ట్విస్టులు..ఒక్కసారిగా ఒంటిపై గాయాలు
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు ఈ నెల 28వ తేదీవరకు రిమాండ్ విధిస్తూ సీఐడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయన కాలికి ఉన్న గాయాలు తగ్గేవరకు ఆస్పత్రిలో చికిత్స అందించాలని న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. అంతేకాదు ఆయనుకున్న వై-కేటగిరీ భద్రతా సిబ్బంది కూడా అప్పటివరకు ఆయనతో ఉండొచ్చని కోర్టు పేర్కొంది. రఘురామ కోలుకునే వరకు ఆస్పత్రిలోనే ఉంచొచ్చని న్యాయస్థానం చెప్పినట్లు న్యాయవాదులు చెప్పారు.

కోర్టులో ట్విస్టులు
అంతకు ముందు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోర్టు ఎపిసోడ్లో ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. మధ్యాహ్నం బెయిల్ కోరుతూ హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ముందు సీఐడీ కోర్టును ఆశ్రయించి ఆ తర్వాతే హైకోర్టుకు రావాలని న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. రఘురామ కృష్ణం రాజు అరెస్టు అక్రమం అని ఆయన తరపున న్యాయవాదులు వాదించారు. అంతేకాదు రఘురామ ఒంటిపై దెబ్బలు కనిపించాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పోలీసులు తనను కొట్టారంటూ లిఖిత పూర్వకంగా జడ్జికి ఎంపీ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రిమాండ్ను రద్దు చేసి ఎంపీ రఘురామను విడుదల చేయాలని సీఐడీ కోర్టును న్యాయవాదులు కోరారు. ఈ సమయంలోనే సుప్రీకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు హైకోర్టులో స్పెషల్ మోషన్ మూవ్ చేశారు.

నిన్న లేని గాయాలు ఈరోజు ఎలా వచ్చాయి..?
ఈ పిటిషన్ను జస్టిస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని డివిజన్ బెంబ్ విచారణ చేసింది. రఘురామ కృష్ణం రాజు ఒంటిపై నిన్న కనిపించని గాయాలు ఈరోజు ఎలా వచ్చాయని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఒకవేళ గాయాలు నిజమే అయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కోర్టు హెచ్చరించింది. గాయాల చిత్రాలు దృశ్యాలను జడ్జిలకు న్యాయవాదులు చూపించారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించిన హైకోర్టు... ఆయన గాయాలు నిజమా కాదా అని తేల్చాలని ఇందుకు వైద్యులతో కూడిన నిపుణుల కమిటీని కోర్టు ఏర్పాటు చేసింది.ఆదివారం మధ్యాహ్నం వరకు నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశాలిచ్చింది.
Recommended Video

కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు: ఏఏజీ
ఇదిలా ఉంటే సీఐడీ తరపున వాదనలు వినిపించిన ఏఏజీ పొన్నవోలు రఘురామ కృష్ణంరాజు కోర్టును తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పారు. రఘురామకృష్ణరాజు పిటిషన్ను హైకోర్టు మధ్యాహ్నం డిస్మిస్ చేసిందని గుర్తు చేసిన పొన్నవోలు... మధ్యాహ్నం రఘురామకృష్ణరాజుకు కుటుంబసభ్యులు భోజనం తీసుకొచ్చారని చెప్పారు. అప్పటి వరకు కూడా రఘురామకృష్ణం రాజు మామూలుగానే ఉన్నారని పిటిషన్ డిస్మిస్ కాగానే ఆయన కొత్తనాటకానికి తెర తీశారని చెప్పారు. పోలీసులు కొట్టారంటూ సాయంత్రం కొత్త కథను అల్లారని చెప్పారు. రఘురామకృష్ణం రాజు ఆరోపణలపై కోర్టు మెడికల్ కమిటీ వేసిందని చెప్పిన ఏఏజీ రేపు మధ్యాహ్నంలోగా పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని సూచించినట్లు ఏఏజీ పొన్నవోలు చెప్పారు. ప్రస్తుతం రఘురామ కృష్ణం రాజును జీజీహెచ్కు లేదా ప్రైవేట్ హాస్పిటల్కు తరలించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications