తెలిసింది చెప్పా, వేధించడంలో చంద్రబాబు దిట్ట: విచారణపై తర్వాత భూమన
అమరావతి: అమాయకులను వేధించడంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిట్ట అని వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. రెండో రోజు ఏడు గంటల విచారణ ముగిసిన తర్వాత అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.
తుని మంటల్లో చంద్రాబబు చలికాచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. తుని ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పానని అన్నారు. సీఐడీ అధికారులు హరికృష్ణ, భాస్కర్ సంస్కార వంతంగా, సభ్యతగా తనను ఏమాత్రం నొప్పించకుండా తుని ఘటనకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు.

సీఐడీ అధికారుల ముందు తుని ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టంగా పేర్కొనడం జరిగిందని అన్నారు. అధికారులకు కావాల్సిన సమాచారాన్ని అడిగారని, తనకు తెలిసింది చెప్పానని అన్నారు. తాను ఎవరికీ భయపడనని, ఏ తప్పూ చేయనని చెప్పారు. బీసీ రిజర్వేషన్ తక్షణం అమలు చేయాలని, ముఖ్యమంత్రి తన చిత్తశుద్ధిని చూపాలని ఆయన డిమాండ్ చేశారు.
తుని ఘటనతో సంబంధం లేకున్నా మమల్ని బద్నాం చేసేందుకు తుని ఘటనను చంద్రబాబు వినియోగించుకుంటున్నారని మండిపడ్డారు. తుని ఘటనలో అమాయకులను బలి చేయడం ఘోరమైన నేరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుని ఘటనతో ఎలాంటి సంబంధం లేని తనను పిలిపించండం వెనుక చంద్రబాబు ప్రకటనే కారణమని అన్నారు. తునిఘటనపై సుప్రీం జడ్డితో విచారణ జరిపించాలని భూమన డిమాండ్ చేశారు.
''చంద్రబాబు పాపాల గని. ఆయన చరిత్ర అంతా కుట్రలు, కుతంత్రాలు, వంచన. వీటితోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పెరిగారు. అమాయకులను వేధించడంలో ఆయన దిట్ట. తనను అధిక్షేపించేవాళ్లను, తన అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకించే వాళ్లను ఆయన సహించలేరు. విరుద్ధ అభిప్రాయాల పట్ల ఆయనకు గౌరవం లేదు." అని ఆయన అన్నారు.
''తనకు వ్యతిరేకంగా ఆలోచన చేసేవారిని సహించలేక.. వాళ్లను అరాచకవాదులుగా చిత్రించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగానే నామీద కక్షతో నన్ను తుని కేసులో విచారణకు పిలిపించారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రతిఘటించడమే కాపు ఉద్యమం. తమను బీసీలలో చేరుస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు తుంగలో తొక్కడం వల్లే వాళ్లు ఉద్యమించారు.'' అని భూమన పేర్కొన్నారు.
''ఆ సంఘటనతో ఏమాత్రం సంబంధం లేని నన్ను విచారణకు పిలిపించడం వల్ల కాపుజాతి యువకుల గుండెలు రగులుతున్నాయి. వాళ్లందరూ నాకు పరిపూర్ణమైన మద్దతును తెలియజేసినందుకు వారికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని సంఘ విద్రోహశక్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చంద్రబాబు మొదటి రోజు నుంచి చేస్తున్నారు.'' అన్నారు.
''తుని ఘటన వెనక జగన్ ఉన్నారని చంద్రబాబు, హోం మంత్రి మొదటిరోజు నుంచే చెబుతుంటే దాని ప్రభావం విచారణ సంస్థపై ఉండక తప్పదు. ఏదో ఒక రకంగా ఈ తుని ఘటన మేం చేయించామనే కుట్రపూరితమైన ఆలోచనతోనే చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. తునిలో ఆరోజు జరిగిన బహిరంగ సభ తర్వాత చోటుచేసుకున్న విధ్వంసాన్ని ప్రజాస్వామ్యవాదులు ఎవరూ హర్షించరు.'' అన్నారు.












Click it and Unblock the Notifications