వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీకి కీలక ఆధారాలు?
మద్యం కుంభకోణంలో కీలక పాత్రధారిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) మాజీ ఎండీ, ఐఆర్టీఎస్ అధికారి డి.వాసుదేవరెడ్డి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. జగన్ ప్రభుత్వ పెద్దలు, వైసీపీ ముఖ్యనాయకులు సూత్రధారులుగా ఈ కుంభకోణం జరిగిందని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ నానక్రాంగూడలోని ఆయన విల్లాలో సోదాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. మూడు రోజుల నుంచి ఇవి జరుగుతూనే ఉన్నాయి. సోదాల్లో కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.
చోరీ చేసిన వాసుదేవరెడ్డి
కొన్ని కీలక పత్రాలను సోదాల్లో స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాడేపల్లిలోని వాసుదేవరెడ్డి ఇల్లు, ఏపీఎస్బీసీఎల్ ప్రధాన కార్యాలయంలో తాళాలు వేసి ఉన్న కొన్ని బీరువాల్లో సోదాలు చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని అధికారులు ఉన్నతాధికారులకు తెలియజేసి సోదాలకు అనుమతి అడిగారు. అది రాగానే అక్కడ కూడా సోదాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. బేవరేజస్ ప్రధాన కార్యాలయం నుంచి ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, ఇతర పత్రాలను వాసుదేవరెడ్డి దొంగతనం చేశారన్న ఫిర్యాదుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఆధారాలను ధ్వంసం చేయడం, దొంగతనం చేయడం, నేరపూరిత కుట్ర అభియోగాలతో ఈనెల ఆరున వాసుదేవరెడ్డి కేసు నమోదైంది.

ఫైళ్లను మాయం చేసిన వాసుదేవరెడ్డి
గద్దె శివకృష్ణ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదును ఆధారం చేసుకొని నమోదైన ఈ కేసులో భాగంగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ పూర్తైన తర్వాత ప్రాథమిక నివేదిక సిద్ధమవుతుంది. వైసీపీ హయాంలో ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నాయకులు, వారి సన్నిహితులు కలిసి మద్యం తయారీ, దాన్ని కొనుగోలు చేయడం, సరఫరా చేయడం, అమ్మడంలాంటివన్నీ వారి అధీనంలోనే ఉంచుకొని భారీగా దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతున్న తరుణంలో ఈ దోపిడీ, కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాలు, పత్రాలు, హార్డ్డిస్క్లను మాయం చేసేందుకు వాసుదేవరెడ్డి ప్రయత్నాలు చేసినట్లు సీఐడీ గుర్తించింది.












Click it and Unblock the Notifications