ఇంట్లో ఘర్షణ: మరోసారి వార్తల్లోకి ఎక్కిన నటి తారా చౌదరి
హైదరాబాద్: సినీనటి తారాచౌదరి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. హైదరాబాదులోని ఇందిరానగర్లో గల ఆమె నివాసంలో గత రాత్రి ఘర్షణ చోటు చేసుకుంది. తారాచౌదరి ఇంట్లో పనిచేసిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని సందీప్, రాజేష్, ఉదయ్ అనే ముగ్గురు యువకులు దాడి చేశారు.
దీంతో దుర్గాప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు సందీప్తో పాటు అతని ఇద్దరు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే దుర్గాప్రసాద్ మద్యం సేవించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తానాచౌదరి తమకు ఫోన్ చేయడం వల్లే ఆమె నివాసానికి వెళ్లామని సందీప్ చెబుతున్నాడు.
అప్పటికే పూర్తి మద్యంలో ఉన్న దుర్గాప్రసాద్ తమపైనే దాడికి యత్నించాడని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలు పోటాపోటీగా ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తారా చౌదరి గతంలో తీవ్రమైన వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆమె వివాదం కారణంగా రాజకీయాల్లో కూడా కలకలం రేగింది.