ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సూపర్ సిక్స్ లో తల్లికి వందనం పై స్పష్టత ఇచ్చారు. ఈ సారి పథకం అమలు ఎప్పుడనేది సీఎం వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గత ఏడాది అర్హత పొందిన తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం ద్వారా ప్రభుత్వం రూ 13 వేలు జమ చేసింది. గతంలో కుటుంబంలో ఒకరికే అనే నిబంధన తెలిగించింది. కాగా, ఈ ఏడాది తల్లికి వందనం పథకం మరి కొంత మందికి విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లికి వందనం పై నెల్లూరు సభలో ప్రకటన చేసారు. జూన్లో తల్లికి వందనం ఇస్తామని వెల్లడించారు. వేసవి సెలవుల తరువాత జూన్ 12వ తేదీ నుంచి తిరిగి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. గత ఏడాది తరహాలోనే ప్రారంభం తేదీనే తల్లికి వందనం నిధుల జమ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రకటన ద్వారా.. ఈ సారి నిధుల జమ పైన స్పష్టత వచ్చింది. ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ రూ.15 వేల చొప్పున తల్లికి వందనం కింద తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. గత ఏడాది తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో 67,01,653 మంది విద్యార్థులకు రూ.8,454 కోట్ల మేర సాయం అందించారు. వైసీపీ హయాంలో 52శాతం మంది విద్యార్థులకు ఇస్తే.. ప్రజా ప్రభుత్వంలో 84.27 శాతం మందికి అంద చేసినట్లు గతంలో విద్యా శాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు.

ఈ పథకం మరింత మందికి అమలు
అదే సమయంలో అర్హులందరికీ సాయం అందించాలనేది ప్రజా ప్రభుత్వ నిర్ణయంగా లోకేష్ చెప్పుకొచ్చారు. కాగా, కొంతమందికి పాక్షిక సాయం అందించారనే విషయంలో.. సోషల్ వెల్ఫేర్ విభాగంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని.. రెండూ కలిసికట్టుగా అందిస్తున్నామని... గ్యాప్ ఏమైనా ఉంటే వివరాలు ఇవ్వాలని కోరారు. కాగా.. పారిశుద్ధ్య కార్మికులందరికీ తల్లికి వందనం వర్తించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. కాగా.. అర్హత ఉండీ పథకం అందని వారి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపడుతోంది. అదే విధంగా కొత్త బడుల్లో చేరే వారి వివరాల నమోదు పూర్తి చేసి.. నివేదిక వచ్చిన తరువాత వారికి పథకం అమలు చేసే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో.. జూన్ 12వ తేదీ సమయంలో ఈ ఏడాది తల్లికి వందనం నిధులు అర్హుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications