వాలంటీర్ల సేవల కొనసాగింపు పై చంద్రబాబు కీలక ప్రకటన..!!
ఏపీలో వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. జగన్ హయాంలో ప్రారంభించిన వాలంటీర్లకు నాలుగు నెలలుగా జీతాలు లేవు. తమకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
ఎన్నికల హామీ
ఏపీలో తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రూ 10 వేలు వేతనం చెల్లిస్తామని నాడు చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్ల సేవల కొనసాగింపు పైన ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ప్రతీ నెలా పెన్షన్ల పంపిణీ సచివాలయ సిబ్బందితోనే కొనసాగిస్తున్నారు. వాలంటీర్ల సంఖ్య..సేవలను పరిమితం చేస్తూ వారిని వినియోగించుకోవాలని ప్రభుత్వం తొలుత భావించింది. ఈ అంశం పైన తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ప్రస్తావనకు వచ్చింది.

వాలంటీర్ల ఆందోళన
అయితే, వాలంటీర్లు, సచివాలయాల నిర్వహణలో మార్పు పైన పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులను కొందరిని ప్రభుత్వ శాఖల్లో విలీనం పైన ప్రభుత్వంలో కసరత్తు జరుగుతోంది. ఈ సమయంలోనే వాలంటీర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామని అల్టిమేటం ఇచ్చారు. అయితే, ప్రభుత్వం అర్హత ఉన్న వాలంటీర్లకు స్కిల్ శిక్షణ ఇచ్చి వారి సేవలను వినియోగించుకుంటామని చెబుతున్నా..ఇంకా నిర్ణయం జరగలేదు.
చంద్రబాబు వ్యాఖ్యలు
ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వాలంటీర్ల అంశం పైన స్పందించారు. గ్రామ/వార్డు వలంటీర్లను తీసుకునేందుకు ఆలోచన చేస్తామని వెల్లడించారు. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకాన్ని దీపావళి నుంచి అమలు చేస్తామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్కు కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు. గత ప్రభుత్వ సమయంలో వాలంటీర్లు అందరూ వైసీపీకి అనుకూలంగా ఉన్న వారినే నియామకం చేసారనేది ప్రస్తుత ప్రభుత్వంలోని ముఖ్యుల అభిప్రాయం. వారిలో కొందరు రాజీనామా చేసారు. ప్రస్తుతం కొనసాగుతున్న వారి సేవల కొనసాగింపు విషయంలో ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. దీంతో, వచ్చే మంత్రివర్గ సమావేశంలో వీరి విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications