ఎపిలో...చిత్రగుప్తుని చిట్టా రాస్తానంటున్న సిఎం...గల్లా పెట్టె ఖాళీ అంటున్న ఫైనాన్స్ మినిస్టర్..
అమరావతి: ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వేర్వేరు వేదికల మీద రాష్ట్రంలో నెలకొని ఉన్న తాజా పరిస్థితిని ప్రతిబింబించేలా చమత్కారంగా చేసిన వ్యాఖ్యానాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
సిఎం చంద్రబాబు చిత్రగుప్తునిలా చిట్టా రాస్తానని అనగా ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడేమో గల్లా పెట్టె ఖాళీగా ఉందన్నారు. సందర్భం ఏదైనా సిఎం చమత్కారాలు, ఆర్థికమంత్రి నుడికారాలు వెరసి అంతర్లీనంగా ఉన్న హెచ్చరికలు అందరి దృష్టిని ఆకర్షించి అంతిమంగా ఈ వ్యాఖ్యల ఉద్దేశాన్ని పరిపూర్ణంగా నెరవేర్చాయి. ఇంతకీ వీరిద్దరు ఏఏ సందర్భంలో ఎవరిని ఉద్దేశించి ఎందుకు ఈ వ్యాఖ్యానాలు చేశారో ఇప్పుడు తెలుసుకుందాం....

సిఎం...ఎక్కడన్నారంటే...
ప్రకాశం జిల్లా దర్శిలో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్లారు. అయితే అక్కడ చంద్రబాబు ఊహించని విధంగా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కొంత మంది అధికారులు, రాజకీయ నాయకులు మారాలని ఎంత కోరుకుంటున్నా ఇంకా మారడం లేదని వారిని ఎలా మార్చాలో తనకు బాగా తెలుసనీ సిఎం వ్యాఖ్యానించారు. ఇక మరికొంత మంది మాత్రం చాలా వరకు మారారు అని చెబుతూ...అయితే ఎవరు ఎలాంటి తప్పుడు పనులు చేస్తున్నారో అంతా తనకు తెలుసనీ...చిత్రగుప్తుడిలా లెక్కలను రాసుకుంటున్నానని తెలిపారు. అలాగే త్వరలోనే ఆ లెక్కలను మొత్తం సెట్ చేస్తానని కూడా చంద్రబాబు తెలిపారు.

అధికారులు, రాజకీయనాయకులకు... హెచ్చరికలు...
మారని అధికారులు,రాజకీయ నాయుకులను ఎలా మార్చాలో తనకు తెలుసని...అందుకు ప్రజాబలం నాకు కొండంత అండగా ఉందని సిఎం చంద్రబాబు ఈ సందర్భంలో వ్యాఖ్యానించారు. తద్వారా పని చేయని అధికారులకు, రాజకీయ నేతలకు సిఎం ఏక కాలంలో పరోక్ష హెచ్చరికలు చేశారు. ‘‘ ప్రజల ఫిర్యాదులు ఏరూపంలో వచ్చినా వాటిని పరిష్కరించే బాధ్యత నాది. పేదల సంతృప్తే నా ధ్యేయం. అందుకోసం కోసం వెంటపడి పని చేయిస్తా'' అని స్పష్టం చేశారు.మున్ముందు అన్ని కార్యాలయాల్లో కంప్యూటర్ ద్వారా కార్యకలాపాలు సాగుతాయని, అన్నింటికీ జవాబుదారీతనం ఉండేలా చర్యలు చేపడుతున్నామని సిఎం తెలిపారు.

మరోవైపు ఆర్థికమంత్రి ఏమన్నారంటే...
విశాఖ జిల్లా నక్కపల్లిలో మంగళవారం ఐదో విడత ‘జన్మభూమి-మా ఊరు' కార్యక్రమాన్ని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తాళం నా వద్దే ఉంది. గల్లా పెట్టె మాత్రం అంతా ఖాళీగా ఉంది...ఉద్యోగుల జీతాలకు కూడా అప్పు చేయాల్సిన పరిస్థితి. గత ఏడాది రూ.లక్షా 56 వేల కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టినా ఇంకా రూ.20 వేల కోట్ల లోటుతో ప్రభుత్వం నడుస్తోంది. అయినా 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రజారంజకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నామని చెప్పారు.

యనమల ఇంకా ఏమన్నారంటే...
గత కాంగ్రెస్ పాలనలో 14 లక్షల ఇళ్లు నిర్మించామంటూ ఆ పార్టీ నాయకులు రూ.6 వేల కోట్లను దోచుకున్నారు. అందుకే సంక్షేమ పథకాల అమలులో తమ ప్రభుత్వం ఆచితూచి అడుగేస్తోందని అని మంత్రి యనమల చెప్పారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి నెలకు రూ.10 వేల ఆదాయం సమకూరేలా ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. ప్రజలు, రాజకీయ పార్టీల నేతల ఆలోచనా విధానం మారాలని మంత్రి అన్నారు. వ్యక్తిగత అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా...మన జన్మభూమిని మనమే బాగు చేసుకోవాలని ఇందుకు ప్రతి ఒక్కరూ నడుంకట్టాలని పిలుపునిచ్చారు. పోలవరంపై దుష్ప్రచారం చేస్తున్న పార్టీలను ప్రజలు నమ్మకూడదని, వారి ప్రలోభాలకు లొంగకూడదని యనమల రామకృష్ణుడు ఈ సందర్భంగా కోరారు.












Click it and Unblock the Notifications