ఈ ఉన్మాది మారడు: జగన్పై బాబు నిప్పులు, ‘హత్య కుట్రలో వారి పాత్ర’
కడప: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మరోసారి తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. 'ఈ జిల్లాలో ఉన్న ఉన్మాది తన బుద్ధిని ఎప్పటికీ మార్చుకోడు. అభివృద్ధి కోసం అందరూ మారినా.. ఈ పెద్దమనిషిలో మార్పు రాదు' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తాను ప్రగతి కోసం యజ్ఞం చేస్తుంటే.. ఈ ఉన్మాది రాక్షసుడిలా అడ్డుపడుతున్నాడంటూ జగన్మోహన్ రెడ్డిపై ఘాటుగా విమర్శలు గుప్పించాడు. ప్రాణానికే భయపడని తాను ఎవ్వరికీ భయపడేది లేదని తేల్చి చెప్పారు. రాజకీయాల్లో దేశంలోనే సీనియర్ నాయకుడినైనా తనను చెప్పుతో కొట్టండని కడప జిల్లాలో ఉండే పెద్దమనిషి మాట్లాడారని మండిపడ్డారు.
తాను జిల్లా ప్రజల కోసమే ఇదంతా ఓర్చుకున్నట్లు చంద్రబాబునాయుడు తెలిపారు. కడప జిల్లా రాయచోటి మండలంలోని మాధవరం గ్రామం కంచరపల్లెలో ఎండిపోతున్న వేరుశనగ పంటను గురువారం ఆయన పరిశీలించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
తానూ రాయలసీమలోనే పుట్టానని, సీమ సమస్యలు తనకు తెలుసని.. ఇక్కడి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి వాటిని నీటితో నింపుతానని హామీ ఇచ్చారు. పట్టిసీమ నిర్మాణం ద్వారా శ్రీశైలంలో ఆదా అయ్యే నీటిని రాయలసీమకు మళ్లించి ఈ ప్రాంతీయుల ప్రయోజనాలను నెరవేర్చేందుకు ఏడాదిలోనే ఆ ప్రాజెక్టును పూర్తిచేశామని చెప్పారు. అయితే ఈ జిల్లాలో ఉండే పెద్ద మనిషి పట్టిసీమను అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలవరాన్ని కూడా అడ్డుకునేందుకు కోర్టుకు వెళ్లారని ఆరోపించారు.
అంతేగాక, రాజధాని అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. చివరికి రెయిన్ గన్స్ కూడా సరఫరా కాకుండా చేసేందుకు ప్రయత్నం చేశారని అన్నారు. పట్టిసీమకు గండి కొట్టింది కూడా వీరేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, అక్కడ పోలీసు బందోబస్తు పెట్టాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కడప జిల్లాలో రౌడీలు తుపాకులు పట్టుకుని భయభ్రాంతులకు గురిచేసేవారని.. తాను ప్రాణాలతో పాటు పంటలను కాపాడేందుకు ప్రయత్నించే మనిషినని చెప్పారు.
నా హత్య కుట్రలో వారి పాత్ర: బాబు
అలిపిరిలో 2003లో తనపై హత్యాయత్నం చేసిన వారికి సెల్ఫోన్లు ఇచ్చింది ఇటీవల ఎర్రచందనం కేసులో అరెస్టయిన స్మగ్లర్ అని చంద్రబాబు వెల్లడించారు. ఆ స్మగ్లర్కు జగన్ పార్టీ నాయకుల అండదండలున్నాయని తెలిపారు. హత్యాయత్నానికే భయపడని తాను ఎవరికీ భయపడాల్సిన పనిలేదన్నారు.